
Modi US visit: వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతానికే ఈ అమెరికా పర్యటన
అగ్రదేశం పర్యటనకు ముందు ప్రకటించిన ప్రధాని
దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేడు అగ్రదేశం అమెరికా పయనమయ్యారు. ఈ సందర్భంగా ప్రకటన ద్వారా పర్యటన ఉద్దేశాన్ని వెల్లడించారు. అమెరికాతో సహా ప్రపంచ దేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఈ పర్యటన మంచి సందర్భమని అభివర్ణించారు.
మూడు రోజుల అమెరికా పర్యటనలో ప్రధాని క్వాడ్ నేతలతో ప్రత్యక్షంగా భేటీ కానున్నారు. అలాగే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించనున్నారు. అంతేకాకుండా అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికైన తర్వాత ఇరువురు నేతల మధ్య తొలిసారి ముఖాముఖి జరగనుంది. ‘భారత్, యూఎస్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంపై బైడెన్తో కలిసి సమీక్షించనున్నాను. పరస్పర ప్రయోజనాలు కలిగిన సమస్యలపై అభిప్రాయాలు పంచుకోనున్నాను’ అంటూ మోదీ ఆ ప్రకటనలో వెల్లడించారు. కొవిడ్ మహమ్మారి, తీవ్రవాదం, వాతావరణ మార్పుల వంటి అంతర్జాతీయ సవాళ్ల గురించి ఐరాస ప్రసంగంలో ప్రధానంగా ప్రస్తావించనున్నట్లు చెప్పారు.
పర్యటనకు ముందు మోదీ ట్విటర్లో కూడా స్పందించారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆహ్వానం మేరకు అమెరికాకు పయనమైనట్లు వెల్లడించారు. పలు అంతర్జాతీయ సమస్యలపై ఉపాధ్యక్షురాలు కమలాహారిస్తో కూడా చర్చించనున్నట్లు చెప్పారు.