G20 Summit: కూటమిలో.. ‘ఆఫ్రికన్‌ యూనియన్‌’ చేరికతో ప్రయోజనమేంటి..?

భారత్‌ ప్రతిపాదించిన ఆఫ్రికన్‌ యూనియన్‌కు (AU) శాశ్వత సభ్యత్వాన్ని సభ్యదేశాలన్నీ అంగీకరించడం కీలక పరిణామంగా విశ్లేషకులు చెబుతున్నారు.

Updated : 09 Sep 2023 15:00 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచ జీడీపీలో 85శాతం వాటా కలిగిన జీ20 దేశాల శిఖరాగ్ర సదస్సు (G20 Summit) దేశ రాజధాని దిల్లీలో అట్టహాసంగా జరుగుతోంది. ఈ క్రమంలో భారత్‌ ప్రతిపాదించిన ఆఫ్రికన్‌ యూనియన్‌కు (AU) శాశ్వత సభ్యత్వాన్ని సభ్యదేశాలన్నీ అంగీకరించడం కీలక పరిణామంగా విశ్లేషకులు చెబుతున్నారు. 55కు పైగా దేశాలు(కొన్ని సస్పెండ్‌ అయ్యాయి), సుమారు 130 కోట్ల జనాభా కలిగిన ఏయూ ఇందులో చేరడంతో జీ20 కూటమి ప్రపంచానికి మరింత దగ్గరైనట్లైంది. 

 ఈ ప్రాంతంలో 2050 నాటికి జనాభా రెట్టింపు (దాదాపు 250 కోట్లు) అయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా. జీ20 కూటమిలో ఇప్పటి వరకు ఏయూ నుంచి కేవలం ఒక్క దక్షిణాఫ్రికా మాత్రమే సభ్యదేశంగా ఉంది. కానీ, ఇప్పుడు భారత్‌ చొరవ, సభ్యదేశాల అంగీకారంతో ఆఫ్రికన్‌ యూనియన్‌ శాశ్వత సభ్యత్వాన్ని పొందింది. ఈ నేపథ్యంలో శక్తిమంతమైన జీ20లో చేరడం వల్ల అటు ఆఫ్రికన్‌ యూనియన్‌కు, ఇటు కూటమికి పరస్పర ప్రయోజనాలేంటనే విషయం పరిశీలిస్తే..

ఆఫ్రికాకు లాభమేంటి..?

ఆఫ్రికాలో వివాదాస్పదంగా ఉన్న పశ్చిమ సహారా.. ఐరాసతో పాటు ఇతర అంతర్జాతీయ వేదికల్లో ప్రాతినిధ్యం కోసం ఒత్తిడి తెస్తోంది. ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థల్లోనూ సంస్కరణలు చేయాలని వాదిస్తోంది. మరోవైపు, అమెరికానే కాకుండా ఐరోపా దేశాలు ఆఫ్రికాలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నాయి. చైనా ఇప్పటికే ఆఫ్రికాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. భారీ స్థాయిలో రుణాలు ఇచ్చే దేశంగానూ ఉంది. అటు రష్యా కూడా ఇక్కడి దేశాలకు ప్రధాన ఆయుధ సరఫరాదారుగా ఉంది. గల్ఫ్‌ దేశాలూ అక్కడ భారీ స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నాయి. తుర్కియే.. విదేశీ గడ్డపై అతిపెద్ద మిలటరీ బేస్‌ సోమాలియాలో ఉంది. ఇజ్రాయెల్‌, ఇరాన్‌లు కూడా ఆఫ్రికా ఖండంలో తమ భాగస్వాముల కోసం అన్వేషణలో ఉన్నాయి.

జీ20 విస్తరణ.. ఆఫ్రికన్‌ యూనియన్‌కు సభ్యత్వం ప్రకటించిన మోదీ

అయితే, యుద్ధం, తీవ్రవాదం, ఆకలి, విపత్తుల బాధిత దేశంగా ఆఫ్రికాను కొందరు చిత్రీకరిస్తుండటాన్ని అక్కడి నాయకులు వ్యతిరేకిస్తుండగా.. మరికొన్ని దేశాలు మాత్రం ఆఫ్రికాను మధ్యవర్తిగా (రష్యా-ఉక్రెయిన్‌ సంక్షోభంలో ఆఫ్రికన్‌లో శాంతి చర్చలకు ప్రయత్నించిన విధంగా) ఉపయోగించుకుంటున్నాయనే వాదన ఉంది. ఇలా కీలకమైన వనరులు, సామర్థ్యాలున్న ఆఫ్రికన్‌ యూనియన్‌కు జీ20లో శాశ్వత సభ్యత్వం కల్పించడం అంటే ఆ ఖండాన్ని ఓ ప్రపంచ శక్తిగా గుర్తించడమేనని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కూటమికీ ప్రయోజనమే..!

జీ20లో ఆఫ్రికన్‌ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించడం.. ప్రపంచంలోనే అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్యానికి కేంద్రంగా మారనుంది. అంతేకాకుండా వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో ప్రపంచానికి అవసరమైన వనరులు ఈ ఖండంలో పుష్కలంగా ఉన్నాయి. ప్రపంచంలో 60శాతం పునరుత్పాదక శక్తి వనరులు ఆఫ్రికా ఖండంలోనే ఉన్నాయి. ఇందుకు అవసరమైన 30శాతానికిపైగా ఖనిజాలకూ ఆఫ్రికా నిలయం. లిథియం-అయాన్‌ బ్యాటరీల తయారీలో కోబాల్ట్‌ (Cobalt) కీలక ఖనిజం. ప్రపంచవ్యాప్తంగా లభించే కోబాల్ట్‌లో సగానికి పైగా కాంగో(డీఆర్‌సీ)లోనే ఉన్నట్లు ఇటీవల వెల్లడించిన నివేదికలో ఐరాస పేర్కొంది.

ఇలా ఆఫ్రికాలోని వనరులను ఇప్పటికే కొన్ని దేశాలు వినియోగించుకొంటూ లాభాలు పొందుతున్నాయనే వాదన ఉంది. అయితే, వీటివల్ల తమ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధితోపాటు ఆర్థిక వ్యవస్థలకు తోడ్పడాలని స్థానిక నేతలు కోరుకుంటున్నారు. ఎంతో విలువైన తమ సహజ వనరులను పరిగణనలోకి తీసుకోవాలని కెన్యా అధ్యక్షుడు విలియం రుటో ఇటీవలే పేర్కొన్నారు.

ఏయూ ఒకే వాదన వినిపిస్తుందా..?

ఇక్కడివరకు ఎలాగున్నా.. ఏయూ సభ్యదేశాల్లో ఏకాభిప్రాయం తీసుకురావడం ఓ సవాలేననే వాదన ఉంది. ఆర్థిక వ్యవస్థలు బలంగా ఉన్న నైజీరియా, ఇథియోపియా.. ప్రపంచంలోనే అత్యంత పేద దేశాలు ఒకే మాట మీద ఉంటాయా అన్నదే ప్రశ్న. ఎందుకంటే జీ20 వంటి ప్రపంచ వేదికలపై ఏయూ తరఫున (ఏడాదికొకసారి యూనియన్‌ ఛైర్మన్‌ను ఎన్నుకుంటారు) తమ గళాన్ని వినిపించాల్సి ఉంటుంది. అయితే, ఇటువంటి సమష్టి చర్యలకు ముందుకు వస్తున్న ఆఫ్రికన్‌ నాయకులు.. ఇటీవల కొవిడ్‌ మహమ్మారి సమయంలో ఏకమైన విషయాన్ని ఉదహరిస్తున్నారు. ఇలా వసుధైక కుటుంబం పేరుతో ‘ఒకే భూమి.. ఒకే కుటుంబం.. ఒకే భవిష్యత్తు’ నినాదంతో భారత నిర్వహస్తోన్న ఈ సదస్సులో ఏయూ శాశ్వత సభ్యత్వం పొందడం ఈ నినాదాన్ని సాకారం చేసినట్లు కనిపిస్తోందని విశ్లేషకుల భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని