Toxic Liquor: ‘మద్యం తాగితే చస్తారు..’ బిహార్‌ సీఎం ఘాటు వ్యాఖ్య

కల్తీ మద్యం తాగి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన ఘటన బిహార్‌ రాజకీయాలను మరోసారి వణికిస్తోంది. ఈ నేపథ్యంలో తాజా ఘటనపై స్పందించిన సీఎం నీతీశ్‌ కుమార్‌.. మద్యం తాగితే చచ్చిపోతారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించే ప్రసక్తే లేదన్న ఆయన.. మద్యపాన నిషేధం అమలుకు మరింత కృషి చేస్తానన్నారు.

Published : 15 Dec 2022 13:59 IST

పట్నా: బిహార్‌లో కల్తీ మద్యం తాగి (Spurious Liquor) 40 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందించాలని డిమాండ్‌ చేస్తూ ప్రతిపక్ష భాజపాతో పాటు బాధిత కుటుంబాలు ఆందోళన చేపట్టాయి. వీటిపై తీవ్రంగా స్పందించిన ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ (Nitish Kumar).. ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి పరిహారం ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మద్యం తాగితే చస్తారని ఘాటుగా వ్యాఖ్యానించిన ఆయన.. ప్రజలు ఈ విషయంపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 2016 నుంచి మద్యనిషేధం (Liquor Ban) అమల్లో ఉన్న విషయాన్ని నీతీశ్‌ కుమార్‌ గుర్తుచేశారు.

‘కల్తీ మద్యం తాగి (Spurious Liquor) గతంలోనూ చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని అడుగుతున్నారు. మద్యం తాగినవారు కచ్చితంగా చనిపోతారు. ఇందుకు మన కళ్లముందున్న ఘటనే సాక్ష్యం’ అని బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు. మద్యపాన నిషేధం అమల్లో లేని సమయంలోనూ కల్తీ మద్యంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కేవలం బిహార్‌లోనే కాకుండా నిషేధం అమలులో ఉన్న గుజరాత్‌తోపాటు పంజాబ్‌లోనూ ఈ తరహా ఘటనలు జరిగాయన్నారు. బిహార్‌లో మద్యనిషేధ అమలుకు అన్నిరకాలుగా కృషి చేస్తామన్నారు.

40కి చేరిన మృతుల సంఖ్య

సారణ్‌ జిల్లా ఛప్రా ప్రాంతంలోని ఇసువాపుర్‌ పోలీస్‌స్టేషను పరిధిలో కల్తీ మద్యం కారణంగా ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 40కి చేరింది. మరింత మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. మరోవైపు కల్తీ మద్యం ఘటనపై ముఖ్యమంత్రి బహిరంగ క్షమాపణ చెప్పాలని, బాధితులకు పరిహారం అందించాలన్న డిమాండ్‌ పెరుగుతోంది. ఇదే విషయంపై అసెంబ్లీలో బుధవారం నాడు ప్రతిపక్షాలు చేసిన నిరసనలపై మండిపడ్డ నీతీశ్‌ కుమార్‌ .. ‘తాగి సభకు వచ్చారా..?’ అని విపక్షాలపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని