Manipur: మణిపుర్‌ ప్రభుత్వం ఉక్కుపాదం.. 40 మంది తిరుగుబాటుదారుల హతం

ఒక్క రోజు వ్యవధిలో 40 మంది వేర్పాటు వాదులను హతమార్చినట్లు మణిపుర్‌ సీఎం బీరేన్‌ సింగ్‌ తెలిపారు. కొన్ని చోట్ల భద్రతాబలగాల ఆపరేషన్‌ కొనసాగుతున్నట్లు ఆయన వెల్లడించారు.

Updated : 28 May 2023 19:06 IST

ఇంఫాల్‌: మణిపుర్‌లో (Manipur) తిరుగుబాటుదారులపై అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇవాళ ఒక్క రోజే 40 మందిని హతమార్చినట్లు  వెల్లడించింది. తిరుగుబాటుదారులను మణిపుర్‌ ముఖ్యమంత్రి ఎన్‌. బీరేన్‌ సింగ్‌ (Biren singh) ఉగ్రవాదులతో పోల్చారు. 40 మంది ఉగ్రవాదులను కాల్చి చంపినట్లు భద్రతాబలగాల నుంచి సమాచారం అందినట్లు ఆయన మీడియాకు వెల్లడించారు. ‘‘ సాధారణ పౌరులపై ఎమ్‌-16, ఏకే-47, స్నైపర్‌ గన్లతో ఉగ్రవాదులు సాధారణ పౌరులపై దాడికి దిగుతున్నారు. గ్రామాల్లో ప్రవేశించి ఇళ్లకు నిప్పు పెడుతున్నారు. ఇండియన్‌ ఆర్మీ, ఇతర భద్రతాబలగాల సాయంతో వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు 40 మంది ఉగ్రవాదులను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి’’ అని ఎన్‌. బీరేన్‌ సింగ్‌ మీడియాకు తెలిపారు.

‘‘వాళ్లని కుకీ మిలిటెంట్లుగా వాళ్లని పరిగణించలేం. వాళ్లంతా ఉగ్రవాదులు. నిరాయుధులైన సాధారణ ప్రజలపై వాళ్లు కాల్పులకు తెగబడుతున్నారు.’’ అని బీరేన్‌ తెలిపారు. ఇవాళ రాత్రి 2 గంటల సమయంలో ఇంఫాల్‌ లోయలోని సేక్‌మయి, సుంగు, ఫయేంగ్‌, సెరయు తదితర ప్రాంతాల్లో  తిరుగుబాటువాదులు కాల్పులకు పాల్పడ్డారు. అప్రమత్తమైన భద్రతాబలగాలు అక్కడికి చేరుకొని ఎదురు కాల్పులు ప్రారంభించారు. ఇప్పటికీ కొన్ని చోట్ల కాల్పులు కొనసాగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. పలు వీధుల్లో గుర్తు తెలియని మృతదేహాలు చెల్లాచెదురుగా పడిఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 10 మంది వ్యక్తులు బుల్లెట్‌ గాయాలతో పయేంగ్‌లోని రిమ్స్‌ ఆస్పత్రిలో చేరినట్లు అక్కడి వైద్యులు వెల్లడించారు.

ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌ గత కొన్ని రోజులుగా హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఎస్టీ హోదా కోసం మెయిటీలు చేసిన డిమాండ్‌కు మణిపుర్‌ వ్యాలీ ప్రాంతానికి చెందిన చట్టసభ్యుల నుంచి మద్దతు లభించింది. దీంతో గిరిజన ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇది ఘర్షణకు దారితీసింది. మణిపుర్ జనాభాలో 53 శాతం మంది మెయిటీ వర్గానికి చెందినవారే. మణిపుర్ వ్యాలీలో వారి ప్రాబల్యం ఎక్కువ. బంగ్లాదేశ్‌, మయన్మార్‌ నుంచి వస్తోన్న అక్రమ వలసదారులతో తాము సమస్యలు ఎదుర్కొంటున్నామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని