UP Assembly: కోర్టుగా మారిన యూపీ అసెంబ్లీ.. జైలుకు ఆరుగురు పోలీసులు

ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీలో అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది! చట్టాలు చేసే సభ.. న్యాయస్థానంగా మారింది. 19 ఏళ్ల క్రితం ఎమ్మెల్యే పట్ల అమర్యాదగా ప్రవర్తించిన ఆరుగురు పోలీసులకు ఒక రోజు జైలు శిక్ష విధించింది.

Updated : 04 Mar 2023 09:40 IST

సభా హక్కుల ఉల్లంఘన కేసులో చర్య

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీలో అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది! చట్టాలు చేసే సభ.. న్యాయస్థానంగా మారింది. 19 ఏళ్ల క్రితం ఎమ్మెల్యే పట్ల అమర్యాదగా ప్రవర్తించిన ఆరుగురు పోలీసులకు ఒక రోజు జైలు శిక్ష విధించింది. 2004లో భాజపా ఎమ్మెల్యేగా ఉన్న సలీల్‌ విష్ణోయ్‌, ఆయన మద్దతుదారులపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. దీనిపై ఆయన అప్పట్లోనే సభా హక్కుల కమిటీకి ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన కమిటీ.. ఆరుగురికి శిక్ష విధించాలని సోమవారం సిఫార్సు చేసింది. ఈ మేరకు నిందితులను శుక్రవారం సభకు పిలిపించింది. వారికి జైలు శిక్ష విధించాలని శాసనసభ వ్యవహారాల మంత్రి సురేష్‌ కుమార్‌ ఖన్నా ప్రతిపాదించారు. దీనిపై నిర్ణయాధికారం స్పీకర్‌దేనని కాంగ్రెస్‌, బీఎస్పీ సహా వివిధ పార్టీల నేతలు స్పష్టంచేశారు. ఈ మేరకు స్పీకర్‌ సతీశ్‌ మహానా తీర్పు వెలువరించారు. ఈ పోలీసు సిబ్బంది ‘లక్ష్మణ రేఖ’ను అతిక్రమించారని పేర్కొన్నారు. శాసన సభ ప్రాంగణంలోని ఒక గదిని కారాగారంగా పరిగణించి, అందులో వారిని నిర్బంధించాలని ఆదేశించారు. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల వరకూ వారిని అక్కడే ఉంచాలన్నారు. ఆ పోలీసులను బాగా చూసుకోవాలని, ఆహారం, ఇతర వసతులు కల్పించాలని పేర్కొన్నారు. లాఠీఛార్జి జరిగినప్పుడు అధికారంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ, దాని మిత్రపక్షం రాష్ట్రీయ లోక్‌దళ్‌ సభ్యులు.. తాజా తీర్పు వెలువడే సమయంలో సభలో లేరు. కాగా, సలీల్‌ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని