గ్రామాల్లో వైరస్‌.. కట్టడికి కేంద్రం మార్గదర్శకాలు!

గ్రామీణ ప్రాంతాల్లో కొవిడ్‌ కంటైన్‌మెంట్, నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం మరోసారి మార్గదర్శకాలు జారీచేసింది.

Updated : 16 May 2021 16:20 IST

దిల్లీ: దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు తాకిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో కొవిడ్‌ పాజిటివిటీ రేటు దాదాపు 30శాతం నమోదవుతోంది. ఈ నేపథ్యంలో గ్రామీణ భారతంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఆరోగ్య సౌకర్యాలు మరింత మెరుగుపరచాలని ప్రధాని నరేంద్రమోదీ ఆదేశాలతో కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు అన్ని రాష్ట్రాలను మరోసారి అప్రమత్తం చేశారు. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో కొవిడ్‌ కంటైన్‌మెంట్, నిర్వహణపై మరోసారి మార్గదర్శకాలు జారీచేశారు. ముఖ్యంగా అంటువ్యాధుల నివారణలో పాటించినట్లే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక సదుపాయాలను పెంచుకోవడంతో పాటు స్థానికంగా సామాజిక సేవా కార్యక్రమాలను ముమ్మరం చేయాలని సూచించారు.

* గ్రామీణ ప్రజల్లో తీవ్ర అనారోగ్యం, శ్వాస సమస్యలపై నిఘా పెట్టాలి

* ఆశా, ఆరోగ్య కార్యకర్తలతో కొవిడ్‌ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి

* కొవిడ్‌ లక్షణాలున్నవారికి ప్రాథమిక వైద్య సిబ్బందితో టెలిమెడిసిన్‌ వైద్య సేవలందించాలి

* కొవిడ్‌ సోకిన వారిలో ఇతర ఆరోగ్య సమస్యలున్నట్లుయితే వారిని జనరల్‌ ఆసుపత్రికి తరలించాలి

* కొవిడ్‌ బాధితులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలి

* రోగుల ఆక్సిజన్‌ స్థాయిలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. ఆక్సిజన్‌ స్థాయిలు పడిపోతున్న వారిని ఆస్పత్రులకు తరలించాలి

* గ్రామాల్లో సరిపడా పల్స్‌ ఆక్సీమీటర్లు, థర్మామీటర్లను అందుబాటులో ఉంచాలి. ఆక్సీమీటర్లు వాడిన ప్రతిసారి వాటిని శానిటైజ్‌ చేయాలి

* దాదాపు 85శాతం మందిలో కొవిడ్‌ లక్షణాలు స్వల్పంగానే ఉంటున్నాయి. ఇలాంటి వారు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందాలి

* ర్యాపిడ్‌ పరీక్షలపై ఏఎన్‌ఎం, సీహెచ్‌వోలకు శిక్షణ ఇవ్వాలి

* అన్ని ప్రజారోగ్య కేంద్రాల్లోనూ కొవిడ్‌ పరీక్ష కిట్లు అందుబాటులో ఉంచాలి

* కొవిడ్‌ బాధితులందరికీ హోమ్‌ ఐసోలేషన్‌ కిట్లు అందించాలి

* కేసుల సంఖ్య, వైరస్‌ తీవ్రతను బట్టి కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ తప్పనిసరిగా చేయాలి

* ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు, వాలంటీర్ల ద్వారా స్థానిక సేవలను ముమ్మరం చేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని