అప్పుడు నాన్నను చూస్తే బాధేసింది: రానా

ఆరోగ్యం గురించి సమంత అడిగిన ప్రశ్నకు రానా ఏం చెప్పాడంటే?

Updated : 27 Nov 2020 20:56 IST

హైదరాబాద్‌: భల్లాలదేవుడిగా కనిపించి ప్రేక్షకులను ఫిదా చేసిన రానా కొంతకాలం క్రితం అకస్మాత్తుగా సన్నగా మారిపోయి అందర్నీ షాక్‌కు గురిచేశాడు. దీంతో ఆయన ఆరోగ్యం గురించి రకరకాల వార్తలొచ్చాయి. కిడ్నీ సమస్యతో ఇబ్బందిపడుతున్నాడని ఆ వార్తల సారంశం. అయితే వాటిపై ఆప్పుడు రానా కానీ, అతని బృందం కానీ స్పందించలేదు. తాజాగా ‘ఆహా’ ఓటీటీలో ప్రసారమవుతున్న ‘సామ్‌జామ్‌’ కార్యక్రమంలో రానా ఈ విషయాన్ని వెల్లడించాడు. ‘రెండేళ్ల క్రితం మనందరం కలసి కశ్శీర్‌ టూర్‌కి‌ వెళ్లాం. అక్కడ కళ్లకు సంబంధించి ఓ శస్త్ర చికిత్స చేయించుకుంటా అని చెప్పారు. కానీ 24 గంటలు గడిచేసరికి మీ ఆరోగ్యం ఇబ్బందికరమైన‌ సమాచారం విన్నాం. అసలు అప్పుడేం జరిగింది?’ అని రానాని సమంత అడిగింది. దానికి రానా చెప్పిన సమాధానం విని సమంత కన్నీరు పెట్టుకుంది. అసలు రానా ఏం చెప్పాడంటే?

‘‘జీవితం వేగంగా ముందుకు సాగుతున్న సమయంలో చాలామందిలాగే నాకు కూడా చిన్న పాజ్‌ వచ్చింది. ‘అరణ్య’ షూటింగ్‌కి కొన్నిరోజుల ముందు.. పాత్రకు అనుగుణంగా నా కళ్లకు లేసిక్‌ సర్జరీ చేయించుకుందాం అనుకున్నా. శస్త్రచికిత్స కోసం చిన్నతనం నుంచి నాకు తెలిసిన వైద్యుణ్ని సంప్రదించాను. ఆయన బీపీ టెస్ట్‌ చేసి ‘నీ ఆరోగ్యం బాగానే ఉందా?నడుస్తున్నప్పుడు తల తిరుగుతున్నట్లు ఏమైనా అనిపిస్తోందా?’ అని అడిగారు. అలా ఏం లేదు సర్‌.. నేను బాగానే ఉన్నాను అని చెప్పాను. కొంత సమయం తర్వాత.. ‘నీకు బీపీకి సంబంధించి కొంచెం ఇబ్బంది ఉన్నట్లు అనిపిస్తోంది. సర్జరీని మరో రోజుకి వాయిదా వేద్దాం. ఈ లోపు మరో డాక్టర్‌ని కలువు’ అని సూచించారు. ఆ వైద్యుడు దగ్గరకు వెళ్తే మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 10 వరకు రకరకాల పరీక్షలు చేశారు. అదే రోజు రాత్రి ఆ ఆస్పత్రి హెడ్‌ నా దగ్గరకి వచ్చి ‘నీకు ఆరోగ్యపరంగా సమస్య ఉంది. ఇంకొన్ని పరీక్షలు చేయాలి’ అని చెప్పారు. దీంతో వెంటనే నాన్నని తీసుకుని యూఎస్‌ వెళ్లాను. అక్కడ ఓ ఆస్పత్రిలో మూడు రోజుల పాటు వైద్యులు పరీక్షించారు’’ అని చెప్పారు రానా.

అమెరికాలో ఎదుర్కొన్న పరిస్థితుల గురించి చెబుతూ... ‘‘నువ్వు పుట్టినప్పటి నుంచే నీకు బీపీ ఉంది. దాని వల్ల నీకు కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. కిడ్నీలు పాడయ్యాయి. నువ్వు ఇప్పుడు చికిత్స తీసుకోకపోతే చాలా ఇబ్బంది. ఆరు నెలల నుంచి సంవత్సరంలో గుండెపోటు రావొచ్చు, లేదా మెదడులో నరాలు చిట్లి పోవడానికి 70 శాతం అవకాశం ఉంది. అంతేకాదు చనిపోవడానికి 30 శాతం అవకాశం ఉంది’’ అని వైద్యులు చెప్పారు. మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలని చెప్పారు. మాంసాహారం, ఉప్పు తినొద్దని సూచించారు. ‘‘వైద్యుల సూచనలు పాటించి, చికిత్స తీసుకుని ఆరోగ్యంగా తిరిగి స్వదేశానికి వచ్చాను. యూఎస్‌లో‌ ఉన్న రోజులు చాలా క్లిష్టమైనవి. ఆ సమయంలో నాన్నని చూస్తే బాధగా అనిపించింది’’ అని రానా నాటి పరిస్థితుల గురించి వెల్లడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని