రంభ అభిమానిగా జగపతిబాబు!

శర్వానంద్‌, సిద్ధార్థ్‌ కథానాయకులుగా నటిస్తోన్న చిత్రం ‘మహాసముద్రం’. అజయ్‌ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అలనాటి నాయిక రంభ కటౌట్‌పై ఓ ప్రత్యేక గీతాన్ని చిత్రీకరించారట.

Updated : 23 Apr 2021 01:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్: శర్వానంద్‌, సిద్ధార్థ్‌ కథానాయకులుగా నటిస్తోన్న చిత్రం ‘మహాసముద్రం’. అజయ్‌ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అలనాటి నాయిక రంభ కటౌట్‌పై ఓ ప్రత్యేక గీతాన్ని చిత్రీకరించారట. ఇందులో జగపతిబాబు చుంచుమామ అనే పాత్ర చేస్తున్నారు. అంతేకాదు రంభ అభిమానిగా కూడా కనిపించనున్నారట. ఓ ప్రత్యేక గీతాన్ని శర్వానంద్‌, జగపతిబాబు మధ్యలో రంభ కటౌట్‌పై సాంగ్‌ చిత్రీకరణ జరిపారట. తొలుత ఈ సినిమాలో ఐటెమ్‌ పాట కోసం పలువురి కథానాయికలని సంప్రదించగా కుదరకపోవడంతో రంభ కటౌట్‌పై చిత్రబృందం ఈ విధంగా ప్లాన్‌ చేసిందని చెప్పుకుంటున్నారు. మొత్తం మీద ఏదైతేనేం రంభను చాలాకాలం తర్వాత గుర్తు చేస్తున్నందుకు ఆమె అభిమానులు సంతోష పడుతున్నారట. ఇందులో నాయికలుగా అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్‌ నటిస్తున్నారు. ప్రేమ, యాక్షన్‌ డ్రామా నేపథ్యంగా వస్తున్న ఈ సినిమాని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. ఈ మధ్యే సిద్ధార్థ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ని చిత్రబృందం విడుదల చేసింది. చైతన్ భరద్వాజ్‌ సంగీతం అందిస్తుండగా రాజా తోట సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఆగస్టు 19న తెలుగు, తమిళంలో సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని