Janhvi Kapoor: చాలా సార్లు చెప్పా.. ఎన్టీఆర్‌ లెజెండ్‌: జాన్వీ కపూర్‌

‘‘దక్షిణాది చలన చిత్ర పరిశ్రమలో నటించే అవకాశం త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నా’’ అని బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌ తెలిపారు.

Published : 03 Nov 2022 01:07 IST

హైదరాబాద్‌: టాలీవుడ్‌ నటుడు ఎన్టీఆర్‌(Ntr)పై ఉన్న ఇష్టాన్ని బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) మరోసారి వ్యక్తం చేశారు. ఆయనతో కలిసి నటించాలనేది తన కల అని చెప్పారు. ‘మిలీ’ (Mili) సినిమా ప్రచారంలో భాగంగా నగరానికి విచ్చేసిన జాన్వీ.. మీడియాతో ముచ్చటించారు. ఆ క్రమంలో ఎన్టీఆర్‌ గురించి చెప్పమని ఓ విలేకరి అడగ్గా.. ‘‘ఇప్పటికే చాలా సార్లు చెప్పా. ఆయన్ను ఇష్టపడని వారెవరుంటారు. ఎన్టీఆర్‌ ఓ లెజెండ్‌. ఆయనతో కలిసి నటించాలనుంది’’ అని జాన్వీ వివరించారు. అనంతరం, దక్షిణాది చిత్రాలంటే తనకెంతో ఇష్టమని, ఆ ఇండస్ట్రీలో నటించే అవకాశం త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నానని జాన్వీ అన్నారు.

‘మీ దగ్గరకు వచ్చిన కొన్ని కథలను రిజెక్ట్‌ చేశారట. ఏదైనా పెద్ద ప్రాజెక్టు కోసం ఎదురుచూస్తున్నారా?’ అని మరో విలేకరి జాన్వీని ప్రశ్నించగా బోనీ కపూర్‌ స్పందించారు. ఆ విషయాలు చర్చించేందుకు అది సరైన వేదిక కాదని సమాధానాన్ని ఆయన దాటవేశారు. జాన్వీ ప్రధాన పాత్రలో దర్శకుడు మత్తుకుట్టి జేవియర్‌ తెరకెక్కించిన చిత్రమే ‘మిలీ’. మలయాళ చిత్రం ‘హెలెన్‌’కు రీమేక్‌గా రూపొందింది. బోనీ కపూర్‌ నిర్మించిన ఈ సినిమా నవంబరు 4న ప్రేక్షకుల ముందుకురానుంది.


అలా నటించటం మామూలు విషయం కాదు

ఈ సినిమా గురించి జాన్వీ కపూర్ మాట్లాడుతూ ‘‘దర్శకుడు స్క్రిప్టు వినిపించినప్పుడే.. ఈ సినిమాలో నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకునే అవకాశం ఉంటుందనిపించింది. మిలీ పాత్ర సవాలు విసిరింది.  మా నాన్నతో నేను చేసిన తొలి సినిమా ఇది. మైనస్‌ 18 డిగ్రీల ఉష్ణోగ్రతలో 22 రోజుల పాటు ఈ సినిమాని చిత్రీకరించారు. ఓ నటిగా సుమారు 16 గంటల పాటు ఫ్రీజర్‌లో ఉండటం అంటే మామూలు విషయం కాదు. ఆయా సన్నివేశాల్లో నటించేందుకు చాలా ఇబ్బంది పడ్డా’’ అని తెలిపారు. బోనీ కపూర్ మాట్లాడుతూ ‘‘నా 16 (సుమారు) చిత్రాలను హైదరాబాద్‌లోనే చిత్రీకరించాం. ఇక్కడి వారితో నాకు మంచి అనుబంధం ఉంది. నా సతీమణి శ్రీదేవిపై తెలుగు ప్రేక్షకులు ఎంతో అభిమానం కురిపించారు. ఇప్పుడు జాన్వీని ఆదరిస్తారని ఆశిస్తున్నా’’ అని అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని