ఒకేసారి ఐదు చిత్రాల విడుదల ప్రకటన
థియేటర్లలో 100శాతం ఆక్యుపెన్సీకి ప్రభుత్వం నుంచి అనుమతులొచ్చినా బాలీవుడ్ నుంచి భారీ చిత్రాల ప్రకటనలు రావడం లేదు. భారీ చిత్రాలు విడుదలైతేనే ప్రేక్షకులు మళ్లీ ఎప్పటిలా థియేటర్లవైపు అడుగులు వేస్తారంటూ చిత్ర ప్రముఖులు బలంగా చెబుతున్నారు....
ముంబయి: థియేటర్లలో 100శాతం ఆక్యుపెన్సీకి ప్రభుత్వం నుంచి అనుమతులొచ్చినా బాలీవుడ్ నుంచి భారీ చిత్రాల ప్రకటనలు రావడం లేదు. భారీ చిత్రాలు విడుదలైతేనే ప్రేక్షకులు మళ్లీ ఎప్పటిలా థియేటర్లవైపు అడుగులు వేస్తారంటూ చిత్ర ప్రముఖులు బలంగా చెబుతున్నారు. ఇలాంటి తరుణంలో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ యశ్రాజ్ ఫిలిమ్స్ ఒకేసారి తమ సంస్థలో తెరకెక్కిన ఐదు చిత్రాల విడుదల తేదీలను ప్రకటించింది. ‘సందీప్ ఔర్ పింకీ ఫరార్’, ‘బంటీ ఔర్ బబ్లీ 2’, ‘షమ్షేరా’, ‘జయేష్బాయ్ జోర్దార్’, ‘పృథ్విరాజ్’.. ఈ ఐదు ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అర్జున్ కపూర్, పరిణీతి చోప్రా జంటగా నటించిన ‘సందీప్ ఔర్ పింకీ ఫరార్’ చిత్రాన్ని మార్చి 19న విడుదల చేయనున్నారు. దివాకర్ బెనర్జీ ఈ చిత్రానికి దర్శకుడు. వరుణ్ శర్మ దర్శకత్వంలో సైఫ్ అలీఖాన్, రాణీ ముఖర్జీ, సిద్ధాంత్ చతుర్వేది, శర్వరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘బంటీ ఔర్ బబ్లీ 2’. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 23న విడుదల చేస్తారు. రణ్బీర్ కపూర్, సంజయ్ దత్, వాణీ కపూర్ ప్రధాన పాత్రల్లో కరణ్ మల్హోత్ర రూపొందించిన ‘షమ్షేరా’ జూన్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. రణ్వీర్ సింగ్, షాలినీ పాండే జంటగా నటించిన ‘జయేష్బాయ్ జోర్దార్’ను ఆగస్టు 27న విడుదల చేయనున్నారు. దివ్యాంగ్ టక్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అక్షయ్కుమార్ కథానాయకుడిగా చంద్ర ప్రకాష్ ద్వివేది తెరకెక్కిస్తోన్న ‘పృథ్విరాజ్’ చిత్రాన్ని నవంబరు 5న దీపావళి కానుకగా విడుదల చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.