Vishal: సెలబ్రిటీలపై కామెంట్స్‌ చేయడమేనా ట్రెండ్‌ : విశాల్‌

నటి త్రిష సోషల్‌ మీడియా పోస్ట్‌పై హీరో విశాల్‌ స్పందించారు. 

Updated : 21 Feb 2024 14:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్: తనపై ఆరోపణలు చేసిన రాజకీయవేత్త ఏవీ రాజు వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రముఖ హీరోయిన్‌ త్రిష సోషల్‌మీడియాలో పోస్ట్‌ పెట్టిన సంగతి తెలిసిందే. ‘‘అటెన్షన్‌ కోసం ఏ స్థాయికైనా దిగజారిపోయే వారిని పదే పదే చూస్తుండడం అసహ్యంగా ఉంది. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ సారి సమాధానం లీగల్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి వస్తుంది’’ అని ఆమె హెచ్చరించారు. వీరిద్దరి వివాదం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. తాజాగా దీనిపై కోలీవుడ్‌ హీరో విశాల్‌ స్పందిస్తూ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. 

‘‘సెలబ్రిటీలపై నెగిటివ్‌ కామెంట్స్‌ చేయడం అందరికీ ఓ ట్రెండ్‌ అయిపోయింది. ఏదైనా ఉద్యోగం చేసుకోవాలి కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ పేరు సంపాదించాలని అనుకోవడం సరైన పద్ధతి కాదు. ఒక రాజకీయ పార్టీకీ చెందిన వ్యక్తి సినీ పరిశ్రమకు చెందిన వారిపై ఆరోపణలు చేశారని విన్నాను. అది పబ్లిసిటీ కోసమని తెలుసు. ఇలాంటి వాటిపై స్పందిస్తున్నందుకు బాధగా ఉంది. మీరు టార్గెట్‌ చేసినవారు నేనూ ఒకే పరిశ్రమకు చెందిన వాళ్లం, స్నేహితులం. అందుకే మీ పేరు, మీరు ఆరోపించిన వారి వివరాలు ప్రస్తావించడం లేదు. ఒకరి వ్యక్తిగత జీవితంపై చేసిన అనుచిత వ్యాఖ్యలు విన్న మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని క్షమించాలని కోరుకుంటున్నా. కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శిగా కాదు, మనిషిగా ఈ ట్వీట్‌ చేస్తున్నా’’ అని విశాల్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని