
కమలా హారిస్ను అభినందించిన పెన్స్..!
ప్రస్తుత పాలకులు, ఎన్నికైన నేతల మధ్య తొలి సంభాషణ
వాషింగ్టన్: త్వరలో అమెరికా ఉపాధ్యక్ష పదవి చేపట్టనున్న కమలా హారిస్ను.. ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్స్పెన్స్ అభినందించారు. ఈ మేరకు ఫోన్చేసి ఆమెతో మాట్లాడారు. గురువారం మధ్యాహ్నం వీరిరువురి మధ్య సంభాషణ జరిగినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఒక అధికారి తెలిపారు. అధ్యక్ష ఎన్నికల తర్వాత.. అమెరికా ప్రస్తుత పాలకులు, ఎన్నికైన నేతలకు మధ్య జరిగిన మొదటి సంభాషణ ఇదే కావడం గమనార్హం. పైగా క్యాపిటల్ భవనంపై దాడి అనంతరం కమల, పెన్స్ మధ్య జరిగిన ఈ సంభాషణ.. ప్రాధాన్యం సంతరించుకుంది. అధ్యక్షుడిగా ట్రంప్ ఓటమి ధ్రువీకరణ అనంతరం నుంచి పలు కీలక బాధ్యతలను ఉపాధ్యక్షుడు పెన్స్ నిర్వర్తిస్తున్నారు. క్యాపిటల్ దాడి ఘటనను అదుపు చేసిన భద్రతా సిబ్బందిని ఆయనే ప్రశంసించారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతానని ప్రకటించారు. మరో వైపు బైడెన్ విజయాన్ని పదపదే ప్రశ్నిస్తున్న అధ్యక్షుడు ట్రంప్ మాత్రం బైడెన్ ప్రమాణస్వీకారానికి హాజరు కానని స్పష్టం చేశారు. జనవరి 20న బైడెన్, కమలా హారిస్ ప్రమాణం చేయనున్నారు.
ఓవైపు ప్రజల ఆమోదాన్ని అంగీకరించడానికి ట్రంప్ వ్యతిరేకిస్తుండగా.. పెన్స్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్లో బైడెన్ గెలుపును నిలువరించాలన్న ట్రంప్ ఆదేశాల్ని పెన్స్ బేఖాతరు చేశారు. సాధారణంగా అధికారంలో ఉన్నవారు గెలిచిన తమ ప్రత్యర్థుల్ని అభినందించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ, ట్రంప్ మాత్రం ఇప్పటి వరకు ఆ దిశగా ఒక్క అడుగూ వేయలేదు. పెన్స్ మాత్రం అందుకు భిన్నంగా కమలా హారిస్కు ఫోన్ చేసి అభినందించడం.. అధికార బదిలీకి సహకరిస్తానని చెప్పడం విశేషం.
ఇవీ చదవండి..