‘అపరిచిత’ కంగనా రనౌత్‌?

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌పై మహారాష్ట్ర నేతలు ఎదురుదాడికి దిగారు.

Published : 16 Sep 2020 01:05 IST

ముంబయి: తన కార్యాలయం కూల్చివేతకు పాల్పడిన మహారాష్ట్ర ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్న బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌పై ఆ రాష్ట్ర నేతలు ఎదురుదాడికి దిగారు. ఆమెకు మానసిక సమస్యలు ఉన్నాయంటూనే.. ముంబయిని వదిలి పోయిన ‘డ్రామా క్వీన్‌’ అంటూ ఎద్దేవా చేశారు.

‘‘కంగనకు ఒకే మనిషి రెండు రకాలుగా ప్రవర్తించే ‘డ్యుయల్‌ పర్సనాలిటీ’ అనే మానసిక సమస్య ఉంది. ఆమెకు వైద్య చికిత్స అవసరం. ఆమె ఓ నటి. తనకు ఇచ్చిన స్క్రిప్టు ప్రకారమే మాట్లాడుతుంది. ఇలాంటి ఎంతోమంది కంగనాలు వచ్చిపోయారు. అసలు గవర్నర్‌ కంగనను ఎందుకు కలవాలి?అలా అయితే రోజూ నివాసాలను కోల్పోతున్న మురికివాడ వాసులందరినీ కూడా ఆయన కలవాలి కదా..’’ అని మహారాష్ట్ర రవాణాశాఖ మంత్రి అనిల్‌ పరాబ్‌ ప్రశ్నించారు.

ఇక ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రతినిధి సచిన్‌ సావంత్‌.. కంగన నివాసం కూల్చివేస్తే, భాజపా ఎందుకు ఆవేదన చెందుతోందన్నారు. బాలీవుడ్‌-డ్రగ్‌ మాఫియా సంబంధాలను గురించి విమర్శలు గుప్పించిన ఆమె.. దర్యాప్తు సంస్థలకు ఏ సమాచారం ఇవ్వకుండానే హిమాచల్‌ ప్రదేశ్‌కు ఎందుకు తిరిగి వెళ్లిందో అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కంగన అధికార పార్టీ చేతిలో కీలు బొమ్మని ఆయన విమర్శించారు. ఇకపై మహారాష్ట్ర లేదా ముంబయిని గురించి దురుసుగా ప్రకటనలిచ్చినట్లయితే సహించేది లేదని కూడా ఆయన హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని