అమిత్‌జీ.. మీది ఏ గ్యాంగ్‌ మరి..?

జమ్ముకశ్మీర్‌లోని ప్రధాన రాజకీయ పార్టీల కూటమి అయిన పీపుల్స్‌ అలయన్స్‌ ఫర్‌ గుప్‌కార్‌  డిక్లరేషన్‌ను ‘ఒక అపవిత్ర ప్రపంచ కూటమి’గా, గుప్‌కార్‌ గ్యాంగ్‌గా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అభివర్ణించడంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌

Published : 18 Nov 2020 11:13 IST

హోంమంత్రి గుప్కార్‌ గ్యాంగ్‌ ఆరోపణలకు కపిల్‌ సిబల్‌ కౌంటర్‌

దిల్లీ: జమ్మూకశ్మీర్‌లోని ప్రధాన రాజకీయ పార్టీల కూటమి అయిన పీపుల్స్‌ అలయన్స్‌ ఫర్‌ గుప్కార్‌ డిక్లరేషన్‌ను ‘ఒక అపవిత్ర ప్రపంచ కూటమి’గా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అభివర్ణించడంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘‘గతంలో మీరు కూడా పీడీపీతో పొత్తు పొట్టుకున్నారు కదా.. అలాంటప్పుడు మీది ఏ గ్యాంగ్‌?’’ అంటూ ప్రశ్నించారు.

ఆర్టికల్‌ 370 రద్దు ద్వారా దళితులు, మహిళలు, గిరిజనులకు తాము పునరుద్ధరించిన హక్కులను కాలరాసేందుకు ప్రజాకూటమిగా ఏర్పడిన గుప్కార్‌ గ్యాంగ్‌ ప్రయత్నిస్తోందని అమిత్ షా మంగళవారం ఆరోపించారు. ఈ మేరకు వరుస ట్వీట్లలో గుప్కార్‌ కూటమిపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ను కూడా అమిత్ షా దుయ్యబట్టారు. జాతీయ పతాకాన్ని అవమానించిన ఆ గ్యాంగ్‌తో కలిసి కాంగ్రెస్‌ స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ తన వైఖరి ఏంటో దేశ ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. అయితే ఈ విమర్శలను కూటమి పక్షాలు తిప్పికొట్టాయి.

తాజాగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ స్పందిస్తూ.. అమిత్ షాకు కౌంటర్‌ ఇచ్చారు. ‘జమ్మూకశ్మీర్‌లో కల్లోల పరిస్థితులు తీసుకురావాలని కాంగ్రెస్‌, కూటమి ప్రయత్నిస్తున్నాయని అమిత్ షా ఆరోపించారు. అమిత్‌ జీ .. మరి గతంలో భాజపా - పీడీపీ పొత్తు కూడా కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని తీసుకురావడానికేనా? అప్పుడు మీరు ఏ గ్యాంగ్‌ మరి?’ అని సిబల్‌ ప్రశ్నించారు. 

జమ్మూకశ్మీర్‌లో పలు ప్రధాన రాజకీయ పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్‌ 370ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూక్‌ అబ్దుల్లా ప్రత్యేక హోదా పునరుద్ధరణకు చైనా సాయం కోరతామని ప్రకటించగా.. మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తాను జాతీయ పతాకాన్ని ఎగరవేయబోనంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో అమిత్ షా ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ ప్రతిపక్షాలపై మండిపడ్డారు.

గుప్కార్‌ డిక్లరేషన్‌ అంటే..?

2019 ఆగస్టు 4న కేంద్రం జమ్మూకశ్మీర్‌ ప్రత్యేక హోదా రద్దు చేయడానికి ఒక రోజు ముందు భాజపా మినహా అన్ని రాజకీయ పక్షాలు శ్రీనగర్‌లోని గుప్కార్‌ రోడ్డులో ఉన్న ఫరూక్‌ అబ్దుల్లా నివాసంలో సమావేశమయ్యాయి. ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ని సమర్థిస్తూ ఓ సంయుక్త ప్రకటన జారీ చేశాయి. దీన్నే గుప్కార్‌ డిక్లరేషన్‌గా పిలుస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని