ఎంపీల జీతంలో 30% కోత బిల్లుకు ఆమోదం

కరోనా నేపథ్యంలో దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో ఎంపీల వేతనాల్లో కోతకు సంబంధించిన బిల్లును లోక్‌సభ ఆమోదించింది. కొవిడ్‌పై పోరాటంలో నిధుల కొరత ఉండకూడదన్న ..........

Published : 15 Sep 2020 18:26 IST

దిల్లీ: కరోనా నేపథ్యంలో దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో ఎంపీల వేతనాల్లో కోతకు సంబంధించిన బిల్లును లోక్‌సభ ఆమోదించింది. కొవిడ్‌పై పోరాటంలో నిధుల కొరత ఉండకూడదన్న ఉద్దేశంతో ఏడాది పాటు ఎంపీల వేతనాల్లో 30శాతం కోత విధిస్తూ కేంద్ర కేబినెట్‌  నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన బిల్లును సోమవారం సభలో ప్రవేశ పెట్టగా.. మంగళవారం ఆమోదం లభించింది. ఎంపీల వేతనాలు, పింఛన్లలో 30 శాతం కోతకు సంబంధించిన ఆర్డినెన్స్‌కు ఏప్రిల్‌ 6న కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రధాని, కేంద్రమంత్రులతో పాటు ఎంపీలందరి వేతనాల్లో ఏప్రిల్‌ నుంచి ఏడాది పాటు ఈ కోత పడనుంది. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి సహా పలువురు గవర్నర్లు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు స్వచ్ఛందంగా వేతనాల కోతకు ముందుకొచ్చారు. ఈ మొత్తం సంఘటిత నిధి జమకానుంది. అలాగే, కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఎంపీ ల్యాడ్స్‌ నిధులను కూడా రెండేళ్ల పాటు తాత్కాలికంగా రద్దుచేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని