కాంగ్రెస్‌ వాదులైతే లేఖను స్వాగతిస్తారు: ఆజాద్‌

కాంగ్రెస్‌ అధిష్ఠానానికి పార్టీ సీనియర్లు రాసిన లేఖ అంశం నివురు గప్పిన నిప్పులా మారుతోంది. ఓ వైపు పార్టీ ఉన్నతశ్రేణి నాయకత్వం దీని నిర్ధ్వందంగా తప్పుపడుతుండగా..సీనియర్లు మాత్రం సమర్థించుకుంటున్నారు. లేఖకు కారకులైన వారిపై చర్యలకు ఉపక్రమించడాన్ని కపిల్‌ సిబల్‌ వ్యతిరేకించగా.. తాజాగా మరో సీనియర్‌ నేత గులామ్‌నబీ ఆజాద్‌ కూడా పార్టీ చర్యలను తప్పుబట్టారు. నిజమైన కాంగ్రెస్‌ వాదులు..

Published : 28 Aug 2020 01:09 IST

దిల్లీ: కాంగ్రెస్‌ అధిష్ఠానానికి పార్టీ సీనియర్లు రాసిన లేఖ అంశం నివురు గప్పిన నిప్పులా మారుతోంది. ఓ వైపు పార్టీలో కొందరు దీనిని నిర్ద్వందంగా తప్పుపడుతుండగా..సీనియర్లు మాత్రం సమర్థించుకుంటున్నారు. లేఖకు కారకులైన వారిపై చర్యలకు ఉపక్రమించడాన్ని కపిల్‌ సిబల్‌ వ్యతిరేకించగా.. తాజాగా మరో సీనియర్‌ నేత గులామ్‌నబీ ఆజాద్‌ కూడా పార్టీ చర్యలను తప్పుబట్టారు. నిజమైన కాంగ్రెస్‌ వాదులు లేఖను స్వాగతిస్తారంటూ చురకలంటించారు. పార్టీని ప్రక్షాళన చేయని పక్షంలో మళ్లీ ఎన్నికలొస్తే తమ లేఖను వ్యతిరేకించిన ఆఫీస్‌ బేరర్లు, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు కనిపిస్తారా?అని ప్రశ్నించారు.

‘‘ఏ స్థాయి నాయకుడినైనా పార్టీ అంతర్గతంగా ఎన్నికలు నిర్వహించి ఎన్నుకోవాలి. కనీసం ఒక్కశాతం మద్దతు లేని నాయకులు కూడా పార్టీలో వివిధ పదవుల్లో కొనసాగుతున్నారు. వారికి ప్రజల మద్దతు లేకపోతే అక్కడ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలమా? పార్టీ ప్రస్తుత నిబంధనల ప్రకారం ఎవరి మద్దతు లేకపోయినా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగవచ్చు. సీడబ్ల్యూసీ సభ్యుడిగా ఎన్నికైన వారిని తొలగించడం కుదరదు’’ అని ఆజాద్‌ అన్నారు.

పార్టీని పూర్తిగా పక్షాళన చేయాలంటూ 23 మంది కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు అధిష్ఠానానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. దీనిపై పెద్ద దుమారమే రేగింది. నాలుగు రోజుల క్రితం అత్యవసరంగా ఏర్పాటైన  సీడబ్ల్యూసీ సమావేశంలో తాను అధ్యక్షపదవి నుంచి తప్పుకుంటానని సోనియాగాంధీ ప్రతిపాదించారు. కానీ, పార్టీ కోరిక  మేరకు అధ్యక్షురాలిగా కొనసాగేందుకు అంగీకరించారు. మరోవైపు భాజపా నేతలతో కుమ్మక్కై సీనియర్లు లేఖరాశారని రాహుల్‌ గాంధీ మండిపడినట్లు వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి పార్టీ అధిష్ఠానానికి, సీనియర్‌ నాయకులకు మధ్య విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని