Amit Shah: గుజరాత్ ఫలితాల్లో.. AAP పేరే కన్పించదు: అమిత్ షా కౌంటర్

గుజరాత్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ తమకు పోటీనే కాదని అమిత్ షా అన్నారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ కనీసం ఖాతా తెరిచే అవకాశమే లేదన్నారు.

Updated : 30 Nov 2022 13:16 IST

అహ్మాదాబాద్‌: గుజరాత్‌ ఎన్నికల్లో గెలిచి తీరుతామంటూ ఆమ్‌ ఆద్మీ పార్టీ చేస్తోన్న సవాల్‌ను భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడూ కొట్టిపడేస్తూనే ఉంది. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. కేజ్రీవాల్‌ పార్టీ గుజరాత్‌లో కనీసం ఖాతా తెరిచే అవకాశం లేదన్నారు. ఎన్నికల ఫలితాల్లో ఆప్‌ పేరు కూడా కన్పించదంటూ ఎద్దేవా చేశారు.

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అమిత్ షా.. పీటీఐకి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా గుజరాత్‌ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రవేశం గురించి ప్రశ్నించగా.. ప్రతి పార్టీకి ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉంటుందని కేంద్ర హోంమంత్రి అన్నారు. అయితే ఆ పార్టీని ఆమోదించాలా? వద్దా? అన్నది ప్రజలు నిర్ణయిస్తారని తెలిపారు. బడ్జెట్‌కు మించిన హామీలు కురిపిస్తే అవి నెరవేర్చలేరని ప్రజలకు కూడా తెలుసన్నారు. ‘‘గుజరాత్‌ ప్రజల ఆలోచనల్లో ఆప్ అనేదే లేదు. ఎన్నికల ఫలితాలు వరకు ఎదురుచూడండి. గెలిచిన అభ్యర్థుల జాబితాలో ఆమ్‌ ఆద్మీ పార్టీ పేరే కన్పించదు’’ అంటూ అమిత్ షా వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.

ఇదీ చదవండి: ‘ఆప్‌’ కౌన్‌ హై?

కాంగ్రెస్సే ప్రధాన ప్రత్యర్థి..

తమకు ఇంకా కాంగ్రెస్సే ప్రధాన ప్రత్యర్థి అని అమిత్ షా ఈ సందర్భంగా తెలిపారు. అయితే ప్రస్తుతం ఆ పార్టీ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని, గుజరాత్‌ ఎన్నికల్లోనూ ఆ ప్రభావం కన్పిస్తుందని అన్నారు. రాజకీయ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలను అమిత్‌ షా ఖండించారు. దర్యాప్తు సంస్థలు స్వతంత్ర, తటస్థ సంస్థలని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా అఖండ విజయం సాధిస్తుందని హోంమంత్రి ధీమా వ్యక్తం చేశారు.

గుజరాత్‌ తొలి దశ ఎన్నికలకు ప్రచారం ముగిసింది. గురువారం (డిసెంబరు 1) పోలింగ్‌ జరగనుంది. డిసెంబరు 5న రెండో విడత పోలింగ్‌ జరగనుండగా.. డిసెంబరు 8న ఫలితాలను ప్రకటించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు