MCD Polls: మేం అధికారంలోకి వస్తే కోతులను అక్కడికి పంపిస్తాం: ఆప్‌

దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే వీధి కుక్కలు, ఆవులు, కోతుల బెదడ నుంచి దిల్లీ వాసులకు విముక్తి కల్పిస్తామని ఆప్‌ పునరుద్ఘాటించింది. ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి సౌరబ్‌ భరద్వాజ్‌ రోడ్‌ మ్యాప్‌ను వివరించారు.

Published : 17 Nov 2022 22:44 IST

దిల్లీ: దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఎంసీడీ) ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తాము అధికారంలోకి వస్తే వీధి కుక్కలు, కోతులు, ఆవుల బెడద నుంచి దిల్లీ ప్రజలకు విముక్తి కల్పిస్తామని హామీ ఇచ్చిన ఆప్‌..  దానిని ఏవిధంగా అమలు చేయాలనుకుంటుందో ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఈ మేరకు ఆప్‌ అధికార ప్రతినిధి సౌరబ్‌ భరద్వాజ్‌ విలేకరులతో మాట్లాడుతూ.. ఎవరైనా శునకాలను దత్తత తీసుకోవాలను కుంటే.. స్వదేశీ జాతికి చెందిన వాటినే తీసుకోవాలని ఆప్‌ అధికార ప్రతినిధి సౌరబ్‌ భరద్వాజ్‌ పిలుపునిచ్చారు. ఆప్‌ అధికారంలోకి వస్తే.. వీధి శునకాలను దత్తత తీసుకునేలా ఎన్జీవోలను ప్రోత్సహిస్తామన్నారు. దేశీయ శునకాల దత్తతకు వ్యక్తిగతంగా మందుకుకొచ్చిన వారికి కూడా తగిన సాయం చేస్తామని చెప్పారు.

దిల్లీలో కోతుల బెడద విపరీతంగా ఉందని భరద్వాజ్‌ అన్నారు. నీళ్ల ట్యాంకుల్లో దూకి స్నానం చేయడం, వంటింట్లో ఫ్రిజ్‌లు ఓపెన్‌ చేసి ఆహార పదార్థాలు ఎత్తుకుపోవడం రివాజుగా మారిందని చెప్పారు. దక్షిణ దిల్లీలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉందని అన్నారు. తాము అధికారంలోకి వస్తే కోతుల సంరక్షణ, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. అసోలాలో ఇప్పటికే ఇలాంటి కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. దిల్లీ వీధుల్లో ఆవులు ఎక్కువగా కనిపిస్తున్నాయని, పచ్చగడ్డి తినాల్సిన ఆవులు..చెత్తాచెదారం తింటూ ఆనారోగ్యం పాలవుతున్నాయని భరద్వాజ్‌ పేర్కొన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రత్యేక టెక్నాలజీతో గోశాలలు నిర్మిస్తామని అన్నారు. రోడ్లపై తిరుగుతున్న ఆవులకు గోశాలలకు తరలించి సంరక్షిస్తామన్నారు. ఆప్ అధికారంలోకి వస్తే చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల జాబితాను పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇప్పటికే విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని