Eknath Shinde: ఆటో వేగానికి మెర్సిడెస్‌ వెనుకబడిపోయింది.. ఠాక్రేపై శిందే సెటైర్‌..!

మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏక్‌నాథ్‌ శిందేకు తన స్వస్థలంలో ఘన స్వాగతం లభించింది. అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో నెగ్గిన అనంతరం ఠాణె వెళ్లగా ఆయన మద్దతుదారులు ఘనంగా

Updated : 06 Jul 2022 10:56 IST

ముంబయి: మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏక్‌నాథ్‌ శిందేకు తన స్వస్థలంలో ఘన స్వాగతం లభించింది. అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో నెగ్గిన అనంతరం ఠాణె వెళ్లగా ఆయన మద్దతుదారులు ఘనంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన ఆయన తన మాజీ బాస్‌, మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేపై వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ఆటో రిక్షా వేగానికి మెర్సిడెస్‌ వెనుకబడిపోయిందంటూ ఠాక్రేకు కౌంటర్‌ ఇచ్చారు.

‘‘ఆటో రిక్షా వేగానికి మెర్సిడెస్‌(ఉద్ధవ్‌ ఠాక్రేను ఉద్దేశిస్తూ) వెనుకబడింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం సామాన్యుల ప్రజల కోసమే. ఈ ప్రభుత్వం ప్రతి వర్గానికీ న్యాయం జరిగేలా చూస్తుంది. రాష్ట్రంలోని ప్రతి పౌరుడు ఇది మా సొంత ప్రభుత్వమే.. మా కోసమే పనిచేస్తుంది అనేలా కొత్త సర్కారు నిర్ణయాలు ఉంటాయి. అదే గత ప్రభుత్వానికి మా సర్కారుకు తేడా’’ అని విమర్శించారు. ఇదే విషయాన్ని శిందే ట్విటర్‌లోనూ రాసుకొచ్చారు.

ఇటీవల కొత్త ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ.. ఠాక్రే విమర్శలు చేశారు. ‘‘మహా వికాస్‌ అఘాడీ కూటమి ప్రభుత్వాన్ని భాజపా ఎప్పుడూ మూడు చక్రాల ప్రభుత్వం అంటూ ఎద్దేవా చేసేది. ఇప్పుడు ఆ మూడు చక్రాలు నడిపే వ్యక్తికే రాష్ట్ర పగ్గాలు అప్పగించింది’’ అని ఠాక్రే వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలపైనే శిందే తాజాగా స్పందిస్తూ కౌంటర్‌ ఇచ్చారు. కెరీర్‌ తొలినాళ్లలో శిందే కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆటో నడిపిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా ఠాక్రే సర్కారుపై తిరుగుబాటు గురించి కూడా శిందే ప్రస్తావించారు. ‘‘మేం ఏదీ చట్టానికి వ్యతిరేకంగా చేయలేదు. రాజ్యాంగం, నిబంధనలకు అనుగుణంగానే నడుచుకున్నాం. పార్టీకి వ్యతిరేకంగా ఉన్న మాకు 2/3 వంతుల మెజార్టీ ఉంది. అందుకే స్పీకర్‌ కూడా మమ్మల్ని గుర్తించారు. విశ్వాస పరీక్షలోనూ మేం నెగ్గాం. మాది బలమైన ప్రభుత్వం’’ అని చెప్పుకొచ్చారు. అనంతరం భాజపా మద్దతు గురించి మాట్లాడుతూ.. ‘‘భాజపా అధికారం కోసం ఏదైనా చేస్తుందని ప్రజల్లో తప్పుడు అభిప్రాయం ఉంది. నిజానికి మహారాష్ట్రలో భాజపాకు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నా.. ప్రభుత్వాన్ని నడిపే అవకాశం మాకు కల్పించింది. మా హిందుత్వ విధానాలు నచ్చి మాకు మద్దతిచ్చింది’’ అని కొనియాడారు.

కూటమిలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేకపోయాం..

గతంలో మహా వికాస్‌ అఘాడీ కూటమిలో ఉన్నప్పుడు అనేక అంశాలపై ఠాక్రే సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయిందని శిందే వెల్లడించారు. హిందుత్వ, ముంబయి పేలుళ్లు, దావూద్‌ ఇబ్రహీం వంటి అంశాలు చర్చకు వచ్చినప్పుడు.. కొన్ని కారణాల వల్ల శివసేన నిర్ణయాలు తీసుకోలేకపోయిందంటూ కాంగ్రెస్‌, ఎన్సీపీ పార్టీలను పరోక్షంగా విమర్శించారు. ‘‘మహా వికాస్‌ అఘాడీ కూటమిలో మనకు ఒరిగేదీ ఏమీ లేదని మేం అనేక సార్లు ఉద్ధవ్‌జీతో చర్చించాం. కానీ ఆయన పట్టించుకోలేదు’’ అని శిందే దుయ్యబట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని