Telangana News: భాజపాకు ఒక్క అవకాశం ఇవ్వండి: బండి సంజయ్‌

నారాయణపేట జిల్లాలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా సర్వ సమీపంలో ఆయన వాల్మీకి బోయల వద్దకు వెళ్లి వారితో మాట్లాడారు.

Published : 25 Apr 2022 02:15 IST

నారాయణపేట: నారాయణపేట జిల్లాలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా సర్వ సమీపంలో ఆయన వాల్మీకి బోయల వద్దకు వెళ్లి వారితో మాట్లాడారు. వాల్మీకి బోయల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడారు. ‘‘బోయ వాల్మీకులారా కేసీఆర్‌ చరిత్ర రాయండి. భాజపా గెలిస్తే వాల్మీకిల సమస్యను పరిష్కరిస్తాం. మతపరమైన రిజర్వేషన్లకు భాజపా వ్యతిరేకం. వాల్మీకిలను ఎస్టీ జాబితాలో ఎందుకు చేర్చరు? మజ్లిస్‌ కేసీఆర్‌ కుమ్మక్కు వల్లే హిందువులకు అన్యాయం జరుగుతోంది.

బాంచన్‌ బతుకులు కావాలా? పేదల రాజ్యం కావాలా? ఇంటికో ఉద్యోగం ఇవ్వరు.. కానీ కేసీఆర్‌ ఇంట్లో ఐదుగురికి ఉద్యోగాలు. కేసీఆర్‌ కుటుంబం నెలకు రూ.25లక్షల జీతం తీసుకుంటోంది. తెరాస నేతలకు మంత్రి పదవులు భాజపా వేసిన భిక్షే. కేసీఆర్‌ను గద్దే దించాలనే కసితో పాదయాత్ర చేస్తున్నాం. నర్వ మండలంలో మూడు రిజర్వాయర్లున్నా.. నీళ్లు రావు. కేసీఆర్‌ ఫాంహౌజ్‌కు నీళ్ల కోసం రూ.1.20 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు. రూ.వేల కోట్లు ఖర్చు చేసి గోదావరి నుంచి ఫాంహౌజ్‌కు నీళ్లు తెచ్చుకున్నారు. రూ.3, 4 కోట్లిస్తే ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకురావచ్చు.

కేంద్రమంత్రి షెకావత్‌తో మాట్లాడి ఆర్డీఎస్‌ సమస్యను పరిష్కరించాం. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే ఆరు నెలల్లో నీళ్లు తీసుకురావచ్చు. కేంద్ర నిధులను కేసీఆర్‌ దారి మళ్లించారు. ఒక్కసారి భాజపాకు అవకాశం ఇవ్వండి. గడీల రాజ్యం పోవాలి.. గరీబోళ్ల ప్రభుత్వం రావాలి’’ అని బండిసంజయ్‌ అన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని