mayawati: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పాగా: మాయావతి

కాన్షీరామ్‌ పోరాట మార్గంలో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. బహుజన సమాజ్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ భరోసా సభకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

Updated : 07 May 2023 20:28 IST

హైదరాబాద్‌: కాన్షీరామ్‌ పోరాట మార్గంలో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని  బీఎస్పీ అధినేత్రి మాయావతి (mayawati) అన్నారు. బహుజన సమాజ్‌ పార్టీ (BSP) ఆధ్వర్యంలో ఆదివారం సరూర్‌నగర్‌ స్టేడియంలో నిర్వహించిన ‘తెలంగాణ భరోసా సభ’కు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాయావతి మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీల కోసం అంబేడ్కర్‌ రిజర్వేషన్లు తెచ్చినా.. ఇంకా ఆ వర్గాల చెంతకు అభివృధ్ధి చేరలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల కోసం మరిన్ని చట్టాలు తేవాలని న్యాయమంత్రిగా అంబేడ్కర్‌ భావించారని, ఆయన మాటలను అప్పటి ప్రధాని నెహ్రూ లక్ష్య పెట్టలేదన్నారు. జ్యోతిబా పూలే, అంబేడ్కర్‌, నారాయణగురు చూపిన బాటలో పయనిద్దామని పిలుపునిచ్చారు. బడుగు, బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని అంకితం చేశానని మాయావతి చెప్పారు.

బీఎస్పీ కేవలం ఎస్సీల కోసం కాదని, సబ్బండ వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తుందని తెలిపారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి వారి జీవితాల్లో వెలుగులు నింపామన్నారు. తెలంగాణలో పేద దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ చేస్తామని చెప్పి సీఎం కేసీఆర్‌ మాట తప్పారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పాగా వేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

భాజపా, భారాస తోడు దొంగలు: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. భాజపా, భారాస తోడు దొంగలని ఆరోపించారు. అకాల వర్షాలు కురిసి అన్నదాతలు తీవ్రంగా నష్టపోతే సీఎం ప్రగతిభవన్‌ దాటలేదన్నారు. బీసీ, ఎస్టీ, ఎస్సీలు, మైనార్టీలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. బీసీ ప్రధాని అని చెప్పుకొంటున్న ప్రధాని మోదీ.. బీసీలకు ఏం చేశారని ప్రశ్నించారు. తెలంగాణలో బహుజన రాజ్యం ఏర్పడిన తర్వాత రైతు సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

సరూర్‌నగర్‌ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి బీఎస్పీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సభా వేదికపై బహుజన ధూం ధాం కార్యక్రమాలతో హోరెత్తించారు. అంతకు ముందు ఒమిని హాస్పిటల్‌ నుంచి సరూర్‌నగర్‌ మైదానం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని