Sharad Pawar: ఇకపై శరద్‌ పవార్‌ పార్టీ పేరు ఇదే..

మహారాష్ట్రలో శరద్‌ పవార్‌ వర్గానికి పార్టీ పేరును ఈసీ కేటాయించింది. 

Updated : 07 Feb 2024 19:30 IST

ముంబయి: మహారాష్ట్రలో అజిత్‌ పవార్‌ (Ajit pawar) వర్గాన్నే అసలైన ఎన్సీపీగా గుర్తించిన కేంద్ర ఎన్నికల సంఘం (EC) శరద్‌ పవార్‌ (Sharad Pawar) వర్గానికి కొత్త పేరును కేటాయించింది. ఆయన సారథ్యంలోని పార్టీకి ‘నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌పార్టీ- శరద్‌చంద్ర పవార్‌’ పేరును ఖరారు చేసింది. త్వరలోనే మహారాష్ట్రలోని ఆరు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్న వేళ కొత్త పేరు, గుర్తులను ఎంచుకోవాలని ఈసీ మంగళవారం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో శరద్ పవార్‌ వర్గం మూడు పేర్లు, ఎన్నికల గుర్తులను ఈసీ ఆమోదం కోసం పంపింది. వీటిలో నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ- శరద్‌చంద్ర పవార్‌, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ -శరద్‌రావు పవార్‌, ఎన్సీపీ-శరద్‌ పవార్‌ పేర్లు ఉండగా.. ‘ఎన్సీపీ -శరద్‌చంద్ర పవార్‌’ పేరును కేటాయిస్తూ ఈసీ ప్రకటన విడుదల చేసింది. 

అజిత్‌ పవార్‌ గతేడాది ఎన్సీపీ నుంచి చీలి భాజపా-శిందే సారథ్యంలోని ప్రభుత్వంలో చేరడంతో నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (NCP)లో సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే. దీంతో ఎన్సీపీ ఎవరిదనే విషయంలో పార్టీలోని రెండు వర్గాల మధ్య నెలకొన్న వివాదాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఎట్టకేలకు పరిష్కరించింది. అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని వర్గాన్నే అసలైన ఎన్సీపీగా గుర్తించి.. ఆ పార్టీ జెండా, ఎన్నికల గుర్తును కూడా వారికే కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్సీపీకి 53 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. అజిత్‌ వర్గం చీలిక తర్వాత శరద్‌ పవార్‌ పార్టీపై క్రమంగా నియంత్రణ కోల్పోతూ వచ్చారు. ప్రస్తుతం ఆయన వెంట 12మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని