
సీఏఏని వ్యతిరేకిస్తూ 3వేల కి.మీ ర్యాలీ
ముంబయి: పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) వ్యతిరేకిస్తూ కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా 3000 కి.మీ ర్యాలీని చేపట్టారు. గాంధీ శాంతి యాత్ర పేరిట నిర్వహిస్తున్న ఈ ర్యాలీని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ జెండా ఊపి ప్రారంభించారు. ముంబయి నుంచి ప్రారంభమైన ఈ యాత్ర 21రోజుల పాటు కొనసాగనుంది. జనవరి 30 దిల్లీలోని రాజ్ఘాట్ వద్ద ఈ యాత్ర ముగియనుంది. భాజపా పాలిత రాష్ట్రాలైన గుజరాత్, హరియాణా, ఉత్తర్ప్రదేశ్తో సహా ఆరు రాష్ట్రాల మీదుగా ఈ ర్యాలీ జరగనుంది. ఈ సందర్భంగా శరద్పవార్ మాట్లాడారు.
‘కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల భారతదేశ ఐక్యత దెబ్బతింటోంది. మైనార్టీలతో సహా పలు వర్గాలు తాము ఎక్కడి నుంచి వచ్చాం, ఎప్పటి నుంచి భారత్లో నివసిస్తున్నామనే విషయాన్ని రుజువు చేసుకోలేకపోతున్నాయి. కేంద్రం తన అధికారాన్ని దుర్వినియోగం చేసి ఇటువంటి చట్టాన్ని తీసుకొచ్చింది. జేఎన్యూలో జరిగిన ఘటన ఎంతో మంది భారతీయులను కలచివేసింది. సీఏఏను పలువురు వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్నారు. సీఏఏని వ్యతిరేకించేందుకు మహాత్మాగాంధీ సిద్ధాంతమే ఏకైక మార్గం. ఎటువంటి ఆందోళన లేకుండా శాంతియుతంగా ర్యాలీ చేపట్టాలి’ అని ఆయన పిలుపునిచ్చారు. సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్కు వ్యతిరేకంగా తాము ఈ ర్యాలీ చేపడుతున్నట్లు యశ్వంత్ సిన్హా తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.