Kottu Satyanarayana: కాపులు సీఎం కావాలని నాకెందుకుంటుంది?: మంత్రి కొట్టు సత్యనారాయణ

‘కాపులు ముఖ్యమంత్రి కావాలనే వారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వెంట వెళ్లి కేరింతలు కొడుతున్నారు. వారికుంటుందేమో కాపుల్ని సీఎంగా చూడాలన్న ఆలోచన... నాకెందుకు ఉంటుంది?’ అని దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వ్యాఖ్యానించారు.

Updated : 11 Jan 2023 07:21 IST

మంత్రి కొట్టు సత్యనారాయణ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ‘కాపులు ముఖ్యమంత్రి కావాలనే వారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వెంట వెళ్లి కేరింతలు కొడుతున్నారు. వారికుంటుందేమో కాపుల్ని సీఎంగా చూడాలన్న ఆలోచన... నాకెందుకు ఉంటుంది?’ అని దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఆ ఆలోచన మీకు లేదా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన పై విధంగా స్పందించారు. మంగళవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ‘పవన్‌ కల్యాణ్‌ అంటే నాకూ అభిమానమే. సామాజికవర్గ పరంగా అభిమానం ఉంది. మేమందరం బాధపడేలా ఆయన వ్యవహరిస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌, చంద్రబాబుది అపవిత్ర పొత్తు. ఆయన భాజపాను పెళ్లి చేసుకుని తెదేపాతో సంసారం చేస్తానంటున్నారు. కాపుల పరువు తీయవద్దని ఆయనకు చెబుతున్నాం. పవన్‌కల్యాణ్‌ వ్యవహారశైలి చూసి ‘ఆయన్ను ఎవరికైనా చూపించండ్రా అంటూ’ ప్రజలు సినిమా డైలాగ్‌లు విసురుతున్నారు...’’ అని పేర్కొన్నారు.

‘జగన్‌ను మళ్లీ అధికారంలోకి రాకుండా చేయడమనేది చంద్రబాబు, పవన్‌ల వల్ల కాదు’ అని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో ఉన్న వ్యాపారాలు, అక్కడ ఎదురయ్యే ఇబ్బందుల కారణంగానే చంద్రశేఖర్‌ భారాస పార్టీలో చేరారని కొట్టు సత్యనారాయణ చెప్పారు. వంగవీటి రంగా హత్యపై విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.... ‘దేవినేని అవినాష్‌ వైకాపాలో ఎందుకున్నారో? వంగవీటి రాధా తెదేపాలో ఎందుకున్నారో? అనేది బెజవాడ ప్రజల్ని అడిగితే చెబుతారు’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని