తెలంగాణకు కేంద్రం ఏంచేసిందో చెప్తాం: కిషన్‌రెడ్డి

కేంద్రం తెలంగాణకు ఏం చేసిందో వివరిస్తూ పూర్తి గణాంకాలతో నివేదిక తయారు చేస్తున్నట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.

Updated : 25 Jan 2023 06:26 IST

మహబూబ్‌నగర్‌, ఈనాడు డిజిటల్‌: కేంద్రం తెలంగాణకు ఏం చేసిందో వివరిస్తూ పూర్తి గణాంకాలతో నివేదిక తయారు చేస్తున్నట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. భాజపా కార్యవర్గ సమావేశంలో ఆయనతో పాటు పార్టీ నేతలు తరుణ్‌ఛుగ్‌, ఎంపీ లక్ష్మణ్‌, డీకే అరుణ, ఈటల రాజేందర్‌, గరికపాటి మోహన్‌రావు, చింతల రామచంద్రారెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, ప్రేమేందర్‌రెడ్డి మాట్లాడారు. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం సహకరించకుండా ఏ విధంగా అడ్డుకుంటుందో పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరిస్తామన్నారు. పవర్‌ ప్రాజెక్టులకు ఇచ్చే రుణాల్లో 16 శాతం తెలంగాణకే ఇచ్చామన్నారు. ఎస్సీ, ఎస్టీలకు స్కాలర్‌షిప్‌ ఇస్తుంటే భారాస విషప్రచారం చేస్తోందన్నారు. సైన్స్‌సిటీ ఏర్పాటుకు 25 ఎకరాలు ఇవ్వాలని లేఖ రాస్తే భాజపాకు పేరొస్తుందని స్థలం ఇవ్వడం లేదన్నారు. ఎంఎంటీఎస్‌ రెండోదశ విస్తరణకు రాష్ట్రం నిధులివ్వలేదన్నారు. సికింద్రాబాద్‌ స్టేషన్‌ ఎదురుగా భూసేకరణకు అడ్డం పెడుతోందన్నారు. 

* రాచరికం మాదిరిగా రాష్ట్రంలో యువరాజు, యువరాణి పాలన చేస్తూ దోచుకుంటున్నారని  తరుణ్‌ఛుగ్‌ విమర్శించారు.సెవన్‌ స్టార్‌ ఫాంహౌస్‌ నుంచి తాంత్రిక భావాలతో కేసీఆర్‌ పాలిస్తున్నారన్నారు. 60 మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు.  

* మోదీ భారత్‌ను ప్రపంచానికి దిక్చూచిగా తీర్చిదిద్దుతున్నారని ఎంపీ డా.కె.లక్ష్మణ్‌ అన్నారు. జీ-20 సమావేశాల సందర్భంగా అన్ని వర్గాలను భాగస్వామ్యం చేస్తూ ప్రత్యేక కార్యక్రమాలు చేయబోనున్నట్లు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని