జోడో యాత్ర స్ఫూర్తితో హాథ్‌సే హాథ్‌ జోడో యాత్ర: అంజన్‌కుమార్‌

రాహుల్‌గాంధీ ‘భారత్‌ జోడో’ యాత్రను స్ఫూర్తిగా తీసుకొని ‘హాథ్‌ సే హాథ్‌ జోడో’ యాత్రను విజయవంతం చేయాలని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అంజన్‌కుమార్‌ యాదవ్‌ పార్టీ శ్రేణులను కోరారు.

Published : 31 Jan 2023 03:37 IST

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: రాహుల్‌గాంధీ ‘భారత్‌ జోడో’ యాత్రను స్ఫూర్తిగా తీసుకొని ‘హాథ్‌ సే హాథ్‌ జోడో’ యాత్రను విజయవంతం చేయాలని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అంజన్‌కుమార్‌ యాదవ్‌ పార్టీ శ్రేణులను కోరారు. జోడో యాత్ర ముగింపు సందర్భంగా సోమవారం గాంధీభవన్‌లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ‘హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్ర’ కరపత్రాలను ఆవిష్కరించారు. అలాగే మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో అంజన్‌కుమార్‌ యాదవ్‌తో పాటు నాయకులు సంభాని చంద్రశేఖర్‌, టి.కుమార్‌రావు, జి.నిరంజన్‌, చిన్నారెడ్డి, చెరుకు సుధాకర్‌, సునీతారావు, మెట్టు సాయికుమార్‌, రోహిన్‌రెడ్డి, విజయారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘భారత్‌ జోడో’ యాత్ర విజయవంతంగా పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్‌ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు. హైదరాబాద్‌ సహా వివిధ జిల్లాల్లో నాయకులు ఆలయాలు, దర్గాల్లో ప్రత్యేక పూజలు, సర్వమత ప్రార్థనలు చేశారు. హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్ర కూడా విజయవంతం కావాలని ప్రార్థించారు.


హరీశ్‌రావును వైద్యారోగ్య శాఖ నుంచి తప్పించాలి: ఏలేటి

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: హరీశ్‌రావును వైద్య ఆరోగ్య శాఖ నుంచి తప్పించి సమర్థునికి ఆ శాఖను అప్పగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ రాష్ట్ర ఛైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైద్య ఆరోగ్య శాఖ-2022 నివేదిక విడుదల సందర్భంగా హరీష్‌రావు అబద్ధాలు, అనవసర విషయాలు మాట్లాడారని విమర్శించారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల గురించి మాట్లాడే ముందు ఇక్కడ ఓట్లేసిన ప్రజలకు జవాబు చెప్పాలన్నారు. స్పష్టమైన సమాచారంతోనే కాంగ్రెస్‌ ఛార్జిషీట్‌ విడుదల చేసిందన్నారు. గవర్నర్‌ వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నం రాష్ట్రంలో జరుగుతుందని మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని