Chandra babu: చంద్రబాబు చాతుర్యం.. తెదేపా గెలుపు మంత్రం

అధికార పార్టీ కక్షసాధింపు చర్యల్ని, అక్రమ కేసుల్ని, అరాచకాల్ని తట్టుకుంటూ, పార్టీ నాయకులు, శ్రేణుల మనోస్థైర్యం దెబ్బతినకుండా కాపాడుకుంటూ వచ్చిన చంద్రబాబు.. తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లోనూ పట్టుదల, వ్యూహ నైపుణ్యంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి ఘన విజయం సాధించి పెట్టారు.

Updated : 24 Mar 2023 07:46 IST

తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లో పట్టువిడవని వైనం

ఈనాడు, అమరావతి: అధికార పార్టీ కక్షసాధింపు చర్యల్ని, అక్రమ కేసుల్ని, అరాచకాల్ని తట్టుకుంటూ, పార్టీ నాయకులు, శ్రేణుల మనోస్థైర్యం దెబ్బతినకుండా కాపాడుకుంటూ వచ్చిన చంద్రబాబు.. తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లోనూ పట్టుదల, వ్యూహ నైపుణ్యంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి ఘన విజయం సాధించి పెట్టారు. పట్టభద్రులు, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తుందన్న నమ్మకం లేక సీనియర్‌ నేతలే కొందరు వెనక్కు లాగే ప్రయత్నం చేశారు. అయితే ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను, తెదేపాకు పెరుగుతున్న ఆదరణను కచ్చితంగా అంచనా వేసిన చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ చేయాలని నిర్ణయించారు. ఒక్కసారి బరిలోకి దిగాక... వెనక్కి తిరిగి చూడకుండా గెలుపు కోసం విస్తృత కసరత్తు చేశారు. పార్టీ నాయకులు, శ్రేణుల్ని నిరంతరం అప్రమత్తం చేస్తూ.. ఉత్సాహపరుస్తూ ఎన్నికల సమరంలో దూసుకెళ్లేలా చేశారు.

రెండు నెలల ముందు నుంచే కసరత్తు

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా గెలవాలంటే 22 ఓట్లు కావాలి. పార్టీ టికెట్‌పై గెలిచిన ఎమ్మెల్యేల్లో నలుగురు వైకాపాలో చేరడంతో.. తెదేపాకి ప్రస్తుతం 19 మంది శాసనసభ్యుల బలమే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మరొకరైతే పోటీకి వెనుకాడేవారేమో! కానీ అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు జరుగుతున్న ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధిస్తే అది పార్టీలో నూతనోత్సాహం నింపుతుందని భావించిన చంద్రబాబు... పోటీ చేయాలని జనవరిలోనే నిర్ణయించారు. అప్పటి నుంచి గెలిచేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలపై కసరత్తు ప్రారంభించారు. బీసీ సామాజికవర్గానికి చెందిన మహిళా నేత పంచుమర్తి అనురాధను వ్యూహాత్మకంగా ఎన్నికల బరిలో దించారు. తమ పార్టీ ఎమ్మెల్యేల్లో కొందరిని లాక్కునేందుకు అధికార పార్టీ ప్రయత్నించినా, వారి ఆటలు సాగకుండా చేయడంతో పాటు, వైకాపాలోని అసంతృప్త ఎమ్మెల్యేలపై దృష్టి పెట్టారు. తెదేపా అభ్యర్థికి ఓటేస్తారన్న అనుమానం ఉన్న వైకాపా ఎమ్మెల్యేలపై ఆ పార్టీ అధిష్ఠానం గట్టి నిఘా పెట్టినా, మంత్రుల్ని, సీనియర్‌ ఎమ్మెల్యేల్ని వారికి కాపలాగా ఉంచినా కూడా... చంద్రబాబు తన వ్యూహ చతురతతో అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు తెదేపా అభ్యర్థికి ఓటేసేలా చేయగలిగారు. తమ పార్టీ నుంచి నలుగురు ఎమ్మెల్యేల్ని లాక్కున్న అధికార పార్టీకి ఈ విజయంతో ఆయన గట్టి షాక్‌ ఇచ్చారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పక్కా వ్యూహం

మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ ఘన విజయం వెనుక కూడా చంద్రబాబు దూరదృష్టి, వ్యూహచతురతే కీలకంగా పనిచేశాయి. అభ్యర్థుల ఎంపిక నుంచి, ఓటర్ల నమోదు, పోలింగ్‌, ఓట్ల లెక్కింపు వరకు ప్రతి దశలోనూ ఆయన ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానానికి మొదట స్థానిక నాయకులు వేరొక అభ్యర్థిని ఎంపిక చేసినా.. అక్కడి పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికలకు కొద్ది రోజుల ముందు చంద్రబాబు అభ్యర్థిని మార్చారు. విద్యావంతుడిగా మంచి పేరున్న చిరంజీవిరావును అభ్యర్థిగా ఎంపిక చేయడంతోనే అక్కడ పార్టీ విజయం సగం ఖాయమైంది. తూర్పు, పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కంచర్ల శ్రీకాంత్‌, భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డిలను ఎంపిక చేయడంలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ముఖ్యమంత్రి జగన్‌ సొంత నియోజకవర్గం పులివెందులకే చెందిన రామ్‌గోపాల్‌రెడ్డిని అభ్యర్థిగా నిలపడమే సాహసం అనుకుంటే, ఆ ఎన్నికల్లో అధికార పార్టీ దూకుడును, అరాచకాల్ని ఎదుర్కొని ఘన విజయం సాధించడం ద్వారా... అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందే వైకాపాకు గట్టి సవాల్‌ విసిరారు. పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో వైకాపా.. అక్కడి అధికారులపై ఒత్తిడి తెచ్చి ఏదోలా గెలిచేందుకు ప్రయత్నించినా, చంద్రబాబు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖలు రాస్తూ, జిల్లా అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ అధికార పార్టీ ఆగడాలకు అడ్డుకట్ట వేశారు. ఆ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి రామగోపాల్‌రెడ్డి గెలిచినట్టు ప్రకటించినా డిక్లరేషన్‌ ఇవ్వకుండా అధికారులు తాత్సారం చేశారు. చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖలు రాసి, అనంతపురం కలెక్టర్‌ డిక్లరేషన్‌ అందజేసే వరకు పట్టువిడవకుండా పోరాడారు.  


తెదేపా సంబరాలు

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి గురువారం నిర్వహించిన ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించడంపై తెదేపా శ్రేణులు సంబరాల్లో మునిగాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి తరలివచ్చారు. భారీ ఎత్తున బాణసంచా కాల్చి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయకత్వం వర్థిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు తన నివాసంలో కేక్‌ కట్‌ చేశారు. కలిసికట్టుగా పని చేసిన నేతలను అభినందించారు. నేతలు, కార్యకర్తలతో పాటు భద్రతా సిబ్బందికి బాబు స్వయంగా కేక్‌ అందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని