రాహుల్‌, ఉద్ధవ్‌ మధ్య సావర్కర్‌ చిచ్చు!

మహారాష్ట్రలోని మహా వికాస్‌ అఘాడీ(ఎంవీఏ)లో భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్‌, శివసేన(యూబీటీ) మధ్య హిందూ సిద్ధాంత కర్త సావర్కర్‌ అంశం అగ్గి రాజేసింది.

Updated : 28 Mar 2023 12:19 IST

హిందూ సిద్ధాంత కర్తను అవమానిస్తే  సహించబోమన్న శివసేన(యూబీటీ) నేత

దిల్లీ/ముంబయి: మహారాష్ట్రలోని మహా వికాస్‌ అఘాడీ(ఎంవీఏ)లో భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్‌, శివసేన(యూబీటీ) మధ్య హిందూ సిద్ధాంత కర్త సావర్కర్‌ అంశం అగ్గి రాజేసింది. ‘మా దేవుడైన సావర్కర్‌ను అవమానిస్తే ఊరుకోం’ అంటూ మాజీ ముఖ్యమంత్రి శివసేన(యూబీటీ) నేత ఉద్ధవ్‌ ఠాక్రే మండిపడ్డారు. నేరపూరిత పరువు నష్టం కేసులో జైలు శిక్ష, లోక్‌సభకు అనర్హత వేటు అనంతరం కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ మాట్లాడుతూ ‘నా పేరు సావర్కర్‌ కాదు.. క్షమాపణ కోరన’న్న వ్యాఖ్యలపై ఉద్ధవ్‌ ఠాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు.  ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు మేం కలిసివస్తున్నామని రాహుల్‌తో చెప్పాలనుకుంటున్నాను. మన బంధానికి పగుళ్లు వచ్చే ప్రకటనలు చేయొద్దు. వాళ్లు రెచ్చగొడుతూనే ఉంటారు. కానీ, మనం అదుపుతప్పితే దేశం నియంతృత్వ పాలనలోకి జారిపోతుంది’ అని ఉద్ధవ్‌ వ్యాఖ్యానించారు. ‘మనం చేస్తోన్న పోరాటం ప్రజాస్వామ్య పరిరక్షణకే. సావర్కర్‌ మా దేవుడు. ఆయన్ను అవమానిస్తే సహించబోమని స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను’ అని ఉద్ధవ్‌ ఘాటుగానే స్పందించారు. గత ఏడాది నవంబరులోనూ రాహుల్‌ గాంధీ...బ్రిటిష్‌ పాలకులకు సావర్కర్‌ రాసిన క్షమాభిక్ష పత్రాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు.

మహారాష్ట్రలోని ఎంవీఏలో కాంగ్రెస్‌, శివసేన ఉద్ధవ్‌ వర్గం, ఎన్సీపీ భాగస్వామ్య పక్షాలు. ‘రాహుల్‌కు జరిగింది అన్యాయమే. అయితే, సావర్కర్‌ను అవమానించి, సత్యం కోసం జరిగే పోరాటంలో విజయం సాధించలేరు’ అని శివసేన అధికార పత్రిక సామ్నా తన సంపాదకీయంలో వ్యాఖ్యానించింది. దీనిపై మహారాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు నానా పటోలే స్పందిస్తూ...ఎంవీఏ ఉమ్మడి కార్యక్రమంలో సావర్కర్‌ అంశం ఓ భాగం కాదని  పేర్కొన్నారు. అధికారాన్ని కాపాడుకోవడం, అధికారంలోకి రావడం అనేవి తమకు ద్వితీయ ప్రాధాన్య అంశాలని, సిద్ధాంతమే కాంగ్రెస్‌కు ప్రధానమని స్పష్టం చేశారు.

‘సావర్కర్‌ను అవమానిస్తే సహించబోమన్న ఉద్ధవ్‌ ఠాక్రే ఏమి చేయబోతున్నారో చెప్పాలి. అదేమిటో ధైర్యంగా చేసి చూపాల’ంటూ మహారాష్ట్ర సీఎం, శివసేన నేత ఏక్‌నాథ్‌ శిందే సవాల్‌ విసిరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని