Kumaraswamy: మాజీ సీఎం కుమారస్వామికి కర్ణాటక సర్కారు ‘షాక్‌’

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిపై మంగళవారం కేసు నమోదైంది.

Updated : 15 Nov 2023 09:23 IST

అక్రమ విద్యుత్తు వినియోగం కేసు

ఈనాడు, బెంగళూరు: విద్యుత్తు స్తంభం నుంచి అక్రమంగా కరెంట్‌ వినియోగించిన కారణంగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిపై మంగళవారం కేసు నమోదైంది. దీపావళి సందర్భంగా బెంగళూరులోని తన నివాసాన్ని అలంకరించే క్రమంలో ఓ స్తంభం నుంచి అక్రమంగా తీగలను వేసినట్లు బెస్కాం (బెంగళూరు విద్యుత్తు సరఫరా సంస్థ) అధికారులు గుర్తించారు. ఈ సంఘటనపై మంగళవారం బెస్కాం ఏఈఈ ప్రశాంత్‌ కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో జయనగర పోలీసులు కుమారస్వామిపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై కుమారస్వామి స్పందిస్తూ తన నివాసాన్ని అలంకరించే బాధ్యతను ఓ ప్రైవేటు డెకొరేటర్‌కు అప్పగించగా, కేవలం టెస్టింగ్‌ కోసమే బయట నుంచి విద్యుత్తు తీసుకున్నారని చెప్పారు. ఆ సమయంలో తాను ఇంట్లో లేనని వివరించారు. తిరిగి వచ్చిన తర్వాత ఆ విషయం గుర్తించి ఇంట్లో మీటర్‌ నుంచి విద్యుత్తు వాడుకోవాలని సూచించినట్లు కుమారస్వామి చెప్పారు. ఇది అక్రమమని భావిస్తే అధికారులు తనకు నోటీసులు ఇచ్చి విచారణ చేపడితే జరిమానా కట్టేందుకు సిద్ధమని వివరణ ఇచ్చారు. దేశం, రాష్ట్రం మునిగిపోయేంత పని తానేమీ చేయలేదన్నారు. తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో కాంగ్రెస్‌ ఇచ్చిన గ్యారంటీ పథకాల గురించి అప్రమత్తంగా ఉండాలని కుమారస్వామి ప్రకటించిన మరుసటి రోజే కేసు నమోదు కావడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని