Daksha Nagarkar: దక్ష నగర్కర్‌కు ఏమైంది..?ఆందోళనలో అభిమానులు

తాను ఆస్పత్రిలో చేరినట్టు నటి దక్ష నగర్కర్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు.

Published : 07 May 2024 00:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సోషల్‌ మీడియా వేదికగా నటి దక్ష నగర్కర్‌ (Daksha Nagarkar) తన ఆరోగ్య పరిస్థితిపై పెట్టిన పోస్ట్‌ చూసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆమె త్వరగా కోలువాలని కొందరు ఆకాంక్షిస్తే మరికొందరు ‘మీకేమైంది?’ అని కామెంట్లు పెడుతున్నారు. దక్ష తన పోస్ట్‌లో ఏం రాశారంటే..?

‘‘నాకు పరిచయం లేని మనుషుల మధ్య సర్జరీ రూమ్‌లో స్ట్రెచర్‌పై ఉండడం.. నా వెన్నెముకకు రెండుసార్లు అనస్తీషియా చేయడం.. వాటినుంచి కోలువడం.. ఇలా కొన్ని రోజుల నుంచి చాలా కష్టంగా ఉంది. నా ఎమోషన్స్‌ని కంట్రోల్‌ చేసేందుకు నావంతు ప్రయత్నించా. నన్ను ప్రేమించేవారు ఈ పనిని సులభతరం చేశారు. ప్రేమించడం, ప్రేమను పొందడం అంటే ఏంటో చూపించారు. కనిపించని గాయాలను నయం చేసే శక్తి ప్రేమ, కేరింగ్‌కే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని కోరుకుంటున్నా. జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని అమితంగా ప్రేమించేవారు మీ పక్కన ఉండేలా చూసుకోండి. ఆనందకర క్షణాలకు సంబంధించిన వాటినే (ఫొటోలు) పంచుకుంటున్నా. మిగతావి షేర్‌ చేసి బాధ పెట్టాలనుకోవడం నాకిష్టం లేదు’’ అని పేర్కొన్నారు. దక్ష పంచుకున్న వాటిలో ఓ ఫొటోలో ఆమె నవ్వుతూ కనిపించారు. మరో ఫొటోలో చేతికి సెలైన్‌ పెట్టి ఉంది. ఓ చెట్టు, కాఫీ కప్పు తదితర ఇమేజ్‌లు షేర్‌ చేశారు. సమస్య ఏంటో, ఎక్కడ చికిత్స పొందుతున్నారనే వివరాలు ఆమె వెల్లడించలేదు.

‘హుషారు’ చిత్రంతో మెప్పించిన దక్ష ‘జాంబీరెడ్డి’తో మరింత గుర్తింపు పొందారు. ‘బంగార్రాజు’లోని ప్రత్యేక గీతంతో అలరించిన ఆమె.. గతేడాది విడుదలైన ‘రావణాసుర’లోని కీలక పాత్రతో ఆకట్టుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని