Revanth Reddy: త్వరలో భాజపాలోకి తెరాస రాజ్యసభాపక్షం.. రేవంత్‌రెడ్డి జోస్యం

రాజ్యసభలో తెరాస పక్షం భాజపాలో విలీనం కాబోతోందని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి జోస్యం చెప్పారు. ప్రగతిభవన్‌ నుంచి ప్రగతి సాధించిన ఓ ఎంపీ నేతృత్వంలో ఇందుకు రంగం సిద్ధమైందన్నారు. రాజ్యసభలో భాజపాకు మెజార్టీ కోసం రెండు పార్టీలు కలిసి డ్రామాలాడుతున్నాయన్నారు.

Updated : 09 Oct 2022 07:34 IST

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: రాజ్యసభలో తెరాస పక్షం భాజపాలో విలీనం కాబోతోందని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి జోస్యం చెప్పారు. ప్రగతిభవన్‌ నుంచి ప్రగతి సాధించిన ఓ ఎంపీ నేతృత్వంలో ఇందుకు రంగం సిద్ధమైందన్నారు. రాజ్యసభలో భాజపాకు మెజార్టీ కోసం రెండు పార్టీలు కలిసి డ్రామాలాడుతున్నాయన్నారు. షబ్బీర్‌అలీ, అంజన్‌కుమార్‌, సంపత్‌కుమార్‌ తదితరులతో కలిసి రేవంత్‌రెడ్డి శనివారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజ్యసభలో తెరాసకు ఉన్న ఏడుగురు సభ్యుల్లో ఇప్పటికే నలుగురు సిద్ధంగా ఉన్నారని, ఇంకొకరు ముందుకొస్తే విలీనం తథ్యమన్నారు. భాజపాలో విలీనానికి సిద్ధపడ్డవారి జాబితాలో కేకే, సురేశ్‌రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్‌ల పేర్లు లేవని విలేకరులు అడిగిన ప్రశ్నకు రేవంత్‌రెడ్డి బదులిచ్చారు.

తెరాస రద్దవుతుందనే భారాసగా మార్చారు..

కేసీఆర్‌ వ్యూహాత్మకంగానే తెరాసను భారాసగా మార్చారని రేవంత్‌రెడ్డి అన్నారు. 2017లో ఏప్రిల్‌ 1 నుంచి 28 వరకు రాష్ట్రవ్యాప్తంగా గులాబీ కూలీ పేరిట రూ.వందల కోట్ల విరాళాలు సేకరించడంపై దిల్లీ హైకోర్టులో తాను పిటిషన్‌ వేశానన్నారు. దానిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌కు కోర్టు 2018లో ఆదేశాలు జారీ చేసిందన్నారు. దీంతో నివేదిక ఇవ్వాలని ఐటీ అధికారులను ఈసీ కోరగా.. ఇంతవరకు ఇవ్వలేదన్నారు.

కోర్టు ధిక్కరణ కేసు వేయడానికి సన్నద్ధమవుతున్న విషయం తెలుసుకుని.. నివేదిక వస్తే తెరాసను ఈసీ రద్దు చేస్తుందని పార్టీ పేరును కేసీఆర్‌ మార్చారని ఆరోపించారు. ఐటీ నివేదిక ఇవ్వకుండా అడ్డుకున్న అదృశ్యశక్తి ఎవరో భాజపా నేతలు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, ఈటల రాజేందర్‌లు చెప్పాలని డిమాండ్‌ చేశారు. దిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు తెరాసపై చర్యలు తీసుకునేవరకు భారాసకు అనుమతి ఇవ్వొద్దని ఈసీని కోరతానని రేవంత్‌రెడ్డి చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని