Himachal Pradesh: హిమాచల్‌ ‘సీఎం’.. రేసు నుంచి వైదొలిగిన ప్రతిభా సింగ్‌

హిమాచల్‌ ప్రదేశ్ (Himachal Pradesh) తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేది ఇంకా తేలడం లేదు. సీఎం రేసులో ముందు వరుసలో ఉన్న పీసీసీ చీఫ్‌ ప్రతిభా సింగ్‌ (Pratibha Singh) అనూహ్యంగా వైదొలగినట్లు తెలుస్తోంది.

Published : 10 Dec 2022 17:09 IST

శిమ్లా: హిమాచల్‌ ప్రదేశ్‌ (Himachal Pradesh)లో తదుపరి ముఖ్యమంత్రి (Chief Minister) ఎన్నిక వ్యవహారం కీలక మలుపు తిరిగింది. సీఎం రేసులో ముందు వరుసలో ఉన్న రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు ప్రతిభా సింగ్‌ (Pratibha Singh).. అనూహ్యంగా పోటీ నుంచి వైదొలిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్‌ (Congress) ఎమ్మెల్యేల నుంచి తనకు పెద్దగా మద్దతు లేకపోవడంతోనే ఆమె వెనక్కి తగ్గినట్లు సమాచారం.

హిమాచల్‌ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly elections) ఘన విజయం సాధించిన కాంగ్రెస్‌ తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేది మాత్రం ఇంకా తేల్చలేదు. సీఎం పదవికి నేతల మధ్య పోటీ తీవ్రమవడంతో పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. ఇక, ఎన్నికల్లో విజయం తర్వాత సీఎం రేసులో పీసీసీ చీఫ్‌, మాజీ సీఎం వీరభద్ర సింగ్‌ భార్య ప్రతిభా సింగ్‌ పేరు ప్రధానంగా వినిపించింది. ముఖ్యమంత్రి పదవిని తాను ఆశిస్తున్నట్లు ఆమె కూడా వెల్లడించారు. ‘‘వీరభద్ర సింగ్ పేరుతో ఈ ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది. అలాంటప్పుడు ఆయన కుటుంబాన్ని పక్కనబెట్టడం సరికాదు’’ అని ప్రతిభా సింగ్‌ అన్నారు.  ఆమె కుమారుడు విక్రమాదిత్య సింగ్‌ కూడా ఇదే విషయాన్ని స్పష్టంచేశారు. అయితే ఈ అంశంలో అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి అందరం కట్టుబడతామన్నారు.

సుఖ్వీందర్‌ సింగ్‌ ఖాయమేనా?

ప్రతిభా సింగ్‌ సీఎం రేసు నుంచి వైదొలగడంతో మాజీ పీసీసీ అధ్యక్షుడు సుఖ్వీందర్‌ సింగ్‌ సుక్కు ముందంజలో ఉన్నారు. కొత్తగా ఎన్నికైన 40 మంది పార్టీ ఎమ్మెల్యేల్లో ఆయనకు 25 మంది శాసనసభ్యులు మద్దతిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక శాసనసభాపక్ష మాజీ నేత ముకేశ్‌ అగ్నిహోత్రి పేరు కూడా వినిపిస్తోంది.

కాగా.. ముఖ్యమంత్రి ఎంపికపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ సాయంత్రానికి ఆమె నూతన ముఖ్యమంత్రిని ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని