Pawan kalyan: ‘నా వద్ద రూ.వేల కోట్లు.. సుపారీ గ్యాంగులు లేవు’: పవన్‌ కల్యాణ్‌

వైకాపా ప్రభుత్వం 70:30 ప్రభుత్వమని.. వంద మంది కష్టాన్ని 30 మందికి పంచి ఓటు బ్యాంకు చేసుకున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ విమర్శించారు. 

Published : 21 Jun 2023 20:18 IST

ముమ్మిడివరం: వైకాపా ప్రభుత్వం 70:30 ప్రభుత్వమని.. వంద మంది కష్టాన్ని 30 మందికి పంచి ఓటు బ్యాంకు చేసుకున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ విమర్శించారు. వైకాపా ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. వారాహి విజయయాత్రలో భాగంగా కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ మాట్లాడారు.

‘‘నా వద్ద రూ.వేల కోట్లు లేవు.. సుపారీ గ్యాంగులు లేవు. జాతీయ నేతల స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చా. మన అనైక్యత వల్లే కొంత మంది నేతలు మనల్ని భయపెడుతున్నారు. కోనసీమలో పెట్రోల్‌ ఉంది కదా.. అందుకే ఇక్కడి వారిలో ఉద్వేగం ఎక్కువ. కోనసీమలో ఇంకా తాగునీటి సమస్యలు ఉన్నాయి. ఇక్కడ మంచి ఆస్పత్రి కూడా లేదు. కోనసీమలో బాలయోగి అనేక మంచి పనులు చేశారు. ఒక్క వ్యక్తి అన్ని మంచి పనులు చేస్తే అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎన్ని పనులు చేయాలి? ఉభయ గోదావరి, కోనసీమ జిల్లాల ప్రజలకు నేను అండగా ఉంటా. ఈ సీఎం.. ఒక ఎంపీని కొట్టించగలరు. ఒక ఎమ్మెల్సీ.. ఎస్సీ వ్యక్తిని చంపి డోర్‌ డెలివరీ చేయగలరు. చంపేసి డోర్‌ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని సీఎం శభాష్‌ అంటారు. కోనసీమకు అంబేడ్కర్‌ జిల్లాగా పేరు పెడితే గొడవలు జరిగాయి. అంబేడ్కర్‌ పేరును వ్యతిరేకించిన వర్గాలకు సీఎం నచ్చజెప్పాలి. మనం అనైక్యంగా ఉంటే మళ్లీ వైకాపా ప్రభుత్వమే వస్తుంది. ప్రజాస్వామ్యంలో పిలిచి మాట్లాడాలి.. అందరినీ కలపాలి. 80 మంది అనైక్యంగా ఉంటే.. 20 మంది ప్రభుత్వమే వస్తుంది.

కులం గురించి మాట్లాడేది నేనా.. మీరా..?

వైకాపా ప్రభుత్వం.. ఉప్మా ప్రభుత్వం. కులం గురించి మాట్లాడితే వైకాపా నేతలకు ఇబ్బందిగా ఉంది. కులం గురించి మాట్లాడేది నేనా.. మీరా..?కులాల గురించి మీరు మాట్లాడవచ్చు.. నేను మాట్లాడకూడదా? మీరు మాత్రం అమరావతికి కులాలు అంటగట్టవచ్చా? కేవలం రెండు కులాలే ఆర్థిక వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకోవాలంటే కుదరదు. అన్ని కులాలు బాగుపడాలి.. పైకి రావాలి. ద్వారంపూడి కుటుంబంలో అన్ని రకాల అధికారాలు ఉన్నాయి. ప్రజలను కలిపేవాడే నాయకుడు.. విడగొట్టేవాడు కాదు.

యువతకు పెట్టుబడి కింద ఉచితంగా రూ.10లక్షలు సాయం..

రైతుల కష్టాలను పోగొట్టే ప్రభుత్వం మనకు కావాలి. రైతులు దూరంగా ఉండే మిల్లులకు ధాన్యం తీసుకెళ్తున్నారు. మేం వచ్చాక దగ్గరున్న మిల్లులకే ధాన్యం తరలిస్తాం. 3 పంటలు పండే చోటు రైతులు ఒక్క పంటకే పరిమితం అయ్యారు. నదుల నుంచి ఇసుకను అడ్డగోలుగా దోచుకుంటున్నారు. మేం అధికారంలోకి వచ్చాక ఇసుక దోపిడీని అరికడతాం. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. యువతకు పెట్టుబడి కింద ఉచితంగా రూ.10లక్షలు ఇస్తాం. కోనసీమ జిల్లాలో పూడికలు సరిగా తీయడం లేదు. కాలువల్లో పూడిక తీయక రైతులు నష్టపోతున్నారు. నేను వస్తున్నానంటే చాలు.. రైతుల ఖాతాల్లో డబ్బులు పడ్డాయి. ఏపీ నాయకుల దోపిడీ వల్ల తెలంగాణ నేతలు మనల్ని తిట్టారు. ఆంధ్రా వాళ్లం అనే భావన లేకుంటే అందరం నష్టపోతాం. కీలకమైన పదవులను రెడ్డి సామాజిక వర్గానికే ఇస్తారా? మిగతా కులాల వారిలో ప్రతిభ లేదా.. ఒక్క కులానికే ఉందా? గట్టిగా అడిగేవాడు ఉంటే చాలు.. ఎవరైనా భయపడతారు. ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా నిలబడే ఉన్నా.  వచ్చే ఎన్నికల్లో నాకు అండగా నిలబడండి’’ అని పవన్‌ కల్యాణ్‌ కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు