వీటికి సమాధానం చెప్పండి.. మోదీ ప్రభుత్వానికి తృణమూల్‌ ప్రశ్నల వర్షం

ప్రధాని మోదీ ప్రభుత్వంపై తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ డెరెక్‌ ఓబ్రెయిన్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మన్మోహన్‌ హయాంతో పోలుస్తూ మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వర్షాకాల సమావేశాల్లో విపక్షాలు....

Published : 13 Aug 2021 01:37 IST

కోల్‌కతా: ప్రధాని మోదీ ప్రభుత్వంపై తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ డెరెక్‌ ఓబ్రెయిన్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మన్మోహన్‌ హయాంతో పోలుస్తూ మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వర్షాకాల సమావేశాల్లో విపక్షాలు వ్యవహరించిన తీరును ప్రశ్నిస్తూ 8 మంది కేంద్రమంత్రులు విలేకరుల సమావేశం నిర్వహించడానికి ప్రతిగా ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ డెరెక్‌ ఓబ్రెయిన్‌ పలు ప్రశ్నలు సంధించారు. పెగాసస్‌, రైతు చట్టాలపై సమాధానం ఇవ్వకుండా ప్రభుత్వం పారిపోయిందంటూ విమర్శించారు.

* మాజీ ప్రధానులు మన్మోహన్‌, దేవెగౌడ చర్చల్లో పాల్గొనేవారు. పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌ షా సమాధానం ఇవ్వకుండా ఎక్కడికి వెళ్లారు?

* దేశ అంతర్గత భద్రతకు సంబంధించిన పెగాసస్‌ అంశంపై  విపక్షాలు పట్టుబట్టినా ప్రభుత్వం కనీసం చర్చకు రానివ్వలేదు. రైతు చట్టాలపైనా చర్చించాలని కోరినా ఎందుకు చర్చకు ఆహ్వానించలేదు?

* రాజ్యసభలో చర్చ జరగకుండానే మొత్తం 39 బిల్లులు ఆమోదం పొందాయి. ఇలానే ప్రజాస్వామ్య దేశం నడిచేది? ఒక్కో బిల్లుకు 10 నిమిషాలా? పైగా సమావేశాలకు విపక్షాలు అంతరాయం కలిగించాయని చెప్పడం ఏంటి?

* 2014లో 60-70 శాతం బిల్లులు పార్లమెంటరీ కమిటీ ముందుకు వెళ్లేవి. ఇప్పుడు 11 శాతం బిల్లులు మాత్రమే ఎందుకుంటున్నాయి?

* ఒకప్పుడు కేవలం ముఖ్యమైన బిల్లులకు మాత్రమే ఆర్డినెన్స్‌లు తెచ్చేవారు. 10 బిల్లులకు కేవలం ఒక్క ఆర్డినెన్స్‌ మాత్రమే వచ్చేది. ఇప్పుడు 10 బిల్లులకు నాలుగు చొప్పున ఆర్డినెన్సులు తెస్తున్నారు. భాజపా పాలన ఎమర్జెన్సీని తలపిస్తోంది.

* మన్మోహన్‌ సింగ్‌ సమాధానాలు ఇచ్చేవారు. ప్రధాని మోదీ ఎందుకు ఏ ఒక్క ప్రశ్నకూ సమాధానం ఇవ్వడం లేదు. 

* రాజ్యసభలో మాకు మెజారిటీ ఉందని చెప్పుకుంటున్న ప్రభుత్వం.. రెండేళ్లుగా ఎందుకు డిప్యూటీ స్పీకర్‌ను నియమించలేదు? అంటూ డెరెక్‌ ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని