IPL 2021: కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ అలా ముగిసింది
ఐపీఎల్లో ఆకర్షణ, ఆదరణకు లోటు లేని జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్ లాంటి మేటి ఆటగాళ్లు ఆ జట్టుతో ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతున్నారు.
ఈనాడు క్రీడావిభాగం
ఐపీఎల్లో ఆకర్షణ, ఆదరణకు లోటు లేని జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్ లాంటి మేటి ఆటగాళ్లు ఆ జట్టుతో ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతున్నారు. క్రిస్ గేల్ సైతం చాలా ఏళ్లు ఆ జట్టుకు ఆడాడు. వీళ్ల కంటే ముందు రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, డేనియల్ వెటోరి లాంటి దిగ్గజ ఆటగాళ్లు జట్టును నడిపించారు. కానీ వీళ్లెవ్వరూ ఆర్సీబీ కప్పు కలను మాత్రం నెరవేర్చలేదు. 2013 నుంచి జట్టు కెప్టెన్గా కొనసాగుతున్న కోహ్లి ప్రతిసారీ భారీ అంచనాలతో బరిలోకి దిగుతున్నాడు కానీ.. ఒక్కసారీ కప్పు అందుకోలేదు. కోహ్లి సారథ్యంలో ఒకసారి (2016), మొత్తంగా మూడుసార్లు ఫైనల్ చేరినా టైటిల్ సాధించలేకపోయిన ఆర్సీబీ.. గత మూడు సీజన్లలో కనీసం ప్లేఆఫ్స్ కూడా చేరలేకపోయింది. ఈసారి సీజన్ తొలి అంచెలో బెంగళూరు మెరుగైన ప్రదర్శన చేయడంతో మళ్లీ కప్పు ఆశలు రేగాయి. అందులోనూ యూఏఈలో రెండో అంచె ఆరంభానికి ముందు ఆర్సీబీ కెప్టెన్గా ఇదే తన చివరి సీజన్ అని ప్రకటించడంతో ఈసారి కప్పు గెలిచి తీరాల్సిందే అన్న భావన అభిమానుల్లో కలిగింది. రెండో అంచెలోనూ రాణించి ప్లేఆఫ్స్ చేరడంతో టైటిల్కు చేరువవుతున్నట్లే కనిపించింది. కానీ సోమవారం ఆశలు, అంచనాలన్నీ కూలిపోయాయి. 13 ఏళ్లుగా చూస్తున్నదే ఈసారీ పునరావృతం అయింది కానీ.. ఈసారి బెంగళూరు అభిమానుల వేదన మాత్రం అంతా ఇంతా కాదు. ఐపీఎల్ టైటిల్ కోసం ఎంతో తపించిన కోహ్లి.. చివరికి ఆ కల నెరవేర్చుకోకుండానే కెప్టెన్సీ విడిచిపెడుతుండటమే ఆ వేదనకు కారణం. కోహ్లి కోసం కప్పు గెలుస్తామన్న మాటను అతడి సహచరులు నిలబెట్టుకోలేకపోయారు. మ్యాచ్ను బాగానే ఆరంభించినా.. మధ్యలో లయ కోల్పోవడం, నరైన్ మాయాజాలానికి విలవిలలాడటంతో తొలి ఇన్నింగ్స్ అయ్యేసరికే బెంగళూరు ఓటమికి బాటలు పడిపోయాయి. లీగ్ దశలో చెలరేగి ఆడిన మ్యాక్స్వెల్ ఈ మ్యాచ్లో మెరుపులు మెరిపించలేకపోవడం, ఈ సీజన్లో అంచనాలను అందుకోలేకపోతున్న ఏబీ ఈ మ్యాచ్లోనూ నిరాశ పరచడం బెంగళూరుకు ప్రతికూలమైంది. తక్కువ స్కోరును కాపాడుకోవడానికి గట్టి ప్రయత్నమే చేసినా, మ్యాచ్ను చివరి ఓవర్ వరకు తీసుకెళ్లినా.. విజయాన్ని మాత్రం ఒడిసిపట్టలేకపోయింది. బంతితో ఆర్సీబీని దెబ్బ తీసిన నరైనే.. మ్యాచ్ ఆర్సీబీ వైపు మొగ్గుతున్నపుడు బ్యాటుతోనూ తీరని నష్టం చేశాడు. మొత్తానికి కోహ్లి సారథిగా చివరి ప్రయత్నంలోనూ కప్పు వేటలో విజయవంతం కాలేదు. ఓవైపు రోహిత్ ముంబయి తరఫున అయిదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ అందుకుంటే.. కోహ్లి ఒక్కసారి కూడా దాన్ని ముద్దాడలేకపోవడం అతడి అభిమానులకు రుచించని విషమయే. ఇది అతడి కెరీర్లో ఎప్పటికీ ఒక లోటే. గత సీజన్లలో జట్టు లీగ్ దశల్లోనే నిష్క్రమించినపుడు కూడా ఉద్వేగానికి గురి కాకుండా తర్వాతి సీజన్లో చూద్దాం అన్నట్లు మామూలుగా కనిపించిన విరాట్.. ఇక ఆ అవకాశం లేకపోవడంతో ఒక రకమైన ఉద్వేగంతో కనిపించాడు. తన కళ్లలో కొట్టొచ్చినట్లు కనిపించిన బాధ చెప్పేస్తుంది.. కోహ్లి ఏం కోల్పోయాడన్నది!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
ఆస్ట్రేలియా హెలికాప్టర్పై నిప్పుల వర్షం.. చైనా దుందుడుకు చర్య
-
Team India: పాక్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. టీమ్ఇండియా వెళ్తుందా? బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే..
-
ఒకే ఫ్రేమ్లో ఇద్దరు సీఈఓలు.. సుందర్ పిచాయ్ గ్రాడ్యుయేషన్ ఫొటో వైరల్
-
చేతులూ కాళ్లూ కట్టేసి సిగరెట్లతో భర్తకు వాతలు.. వీడియోతో పోలీస్స్టేషన్కు బాధితుడు!
-
అభ్యంతరకర వీడియోలున్న.. 25వేల పెన్డ్రైవ్లను పంచారు: కుమారస్వామి