Supreme Court: ప్రజల నమ్మకాన్ని కోల్పోతే.. ఇంకేం మిగలదు: దీదీ సర్కారుకు సుప్రీం చురక

Supreme Court: పశ్చిమబెంగాల్‌లో చోటుచేసుకున్న ఉపాధ్యాయ నియామక కుంభకోణం.. వ్యవస్థీకృత మోసం అని సుప్రీంకోర్టు ఆగ్రహించింది. ఈసందర్భంగా దీదీ సర్కారుకు చురకలంటించింది.

Updated : 07 May 2024 16:52 IST

దిల్లీ: పశ్చిమ బెంగాల్‌ (West Bengal) రాజకీయాలను కుదిపేసిన ఉపాధ్యాయ నియామక కుంభకోణం (Teachers recruitment Scam) వ్యవహారంపై సుప్రీంకోర్టు (Supreme Court) మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా బెంగాల్‌ ప్రభుత్వానికి కఠిన ప్రశ్నలు సంధించింది. ఎంపిక ప్రక్రియ అంశం కోర్టులో ఉండగానే కొత్త పోస్టులు సృష్టించి నియామకాలు ఎలా చేపట్టారని ప్రశ్నించింది. వ్యవస్థపై ప్రజలు నమ్మకాన్ని కోల్పోతే.. ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటారని ఆగ్రహించింది.

బెంగాల్‌లో 2016 నాటి స్టేట్‌ లెవల్‌ సెలక్షన్‌ టెస్ట్‌ (SLST) నియామక ప్రక్రియ చెల్లదని ఇటీవల కలకత్తా హైకోర్టు కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 25,743 మంది టీచర్లు, నాన్‌టీచింగ్‌ సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ జరిపింది. ఈసందర్భంగా దీదీ సర్కారు తీరుపై అసహనం వ్యక్తం చేసింది.

‘‘ఇది వ్యవస్థీకృత మోసమే. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో ప్రభుత్వ ఉద్యోగుల నియామకాల్లో అవకతవకలు జరిగితే.. వ్యవస్థలో ఇంకేం మిగులుతుంది? వ్యవస్థపై ప్రజలు విశ్వాసాన్ని కోల్పోతే దాన్ని మీరు ఎలా ఎదుర్కొంటారు? ప్రజల నమ్మకం పోతే ఇంకేం మిగలదు’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్‌కు సుప్రీం సూచన

ఈసందర్భంగా నియామక ప్రక్రియకు సంబంధించిన డేటాను ఎందుకు భద్రపర్చలేదంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. ‘‘ఆ డేటా ఉందా, లేదా? నియామక ప్రక్రియకు సంబంధించిన అన్ని పత్రాలను డిజిటల్‌ రూపంలో భద్రపర్చడం స్కూల్‌ సర్వీస్‌ కమిషన్‌ బాధ్యత’’ అని గుర్తుచేసింది.

ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్‌ పాఠశాలల్లో 9 నుంచి 12 తరగతులకు ఉపాధ్యాయులతో పాటు గ్రూప్‌ సి, గ్రూప్‌ డి స్టాఫ్‌ సిబ్బంది నియామకాల కోసం 2016లో బెంగాల్‌ సర్కారు రాష్ట్రస్థాయి సెలక్షన్‌ పరీక్ష నిర్వహించింది. 24,650 ఖాళీల భర్తీ కోసం చేపట్టిన ఈ రిక్రూట్‌మెంట్‌ పరీక్షకు 23 లక్షల మందికి పైగా హాజరయ్యారు. ఇందులో అవకతవకలు జరిగినట్లు అప్పట్లోనే ఆరోపణలు రాగా.. ఈ వ్యవహారం కోర్టుకు చేరింది. ఆ అంశం పెండింగ్‌లో ఉండగానే.. ఇందులో ఎంపిక ప్రక్రియను చేపట్టి 25,753 మందికి అపాయింట్‌మెంట్‌ లెటర్లు అందజేశారు. ఖాళీల కంటే అదనంగా కొంతమందిని నియమించడంపై వివాదాస్పదమైంది. ఈ క్రమంలోనే నాటి నియామక ప్రక్రియను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని