Rohit-BCCI: రోహిత్ గాయంపై బీసీసీఐ తాజా అప్‌డేట్.. మూడో వన్డేకి జట్టు ప్రకటన

రోహిత్ శర్మ, కుల్దీప్‌ సేన్, దీపక్ చాహర్ గాయంపై బీసీసీఐ తాజాగా అప్‌డేట్‌ ఇచ్చింది. బంగ్లాదేశ్‌తో చివరి వన్డేకి వీరు ముగ్గురూ దూరం కానున్నారు. జట్టులోకి కుల్‌దీప్‌ యాదవ్‌ వచ్చేశాడు.

Updated : 09 Dec 2022 13:34 IST

ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్‌తో రెండో వన్డే సందర్భంగా గాయపడిన కెప్టెన్ రోహిత్ శర్మ శనివారం జరిగే చివరి మ్యాచ్‌కు అందుబాటులో ఉండడు. ఈ మేరకు రోహిత్ గాయంపై బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. వేలికి గాయంతోనే రెండో వన్డేలో అద్భుతమైన పోరాటం చేసిన విషయం తెలిసిందే. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అర్ధ శతకం సాధించాడు. 

‘‘రెండో వన్డే మ్యాచ్‌ సందర్భంగా బంగ్లా బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో రోహిత్ వేలికి గాయమైంది. వెంటనే స్థానిక ఆసుపత్రిలో స్కానింగ్‌ తీయించుకొని వచ్చాడు. అయితే తదుపరి చికిత్స కోసం రోహిత్ ముంబయికి వెళ్లాడు. దీంతో శనివారం జరిగే మూడో వన్డేలో ఆడడు. అయితే టెస్టు సిరీస్‌కు అందుబాటులో ఉంటాడో లేదో అనేది ఇప్పుడే చెప్పలేం. అలాగే కుల్దీప్‌సేన్, దీపక్ చాహర్‌ కూడా చివరి వన్డేకు అందుబాటులో ఉండరు. మొదటి వన్డే ముగిసిన తర్వాత కుల్దీప్‌ సేన్ వెన్ను నొప్పిగా ఉన్నట్లు మేనేజ్‌మెంట్ దృష్టికి తీసుకొచ్చాడు. అందుకే రెండో మ్యాచ్‌లో అతడికి విశ్రాంతి ఇచ్చాం. వైద్య బృందం సూచనల మేరకు చివరి మ్యాచ్‌కూ రెస్ట్‌ ఇచ్చాం. దీంతో దీపక్ చాహర్‌తో పాటు కుల్దీప్‌ ఎన్‌సీఏకి వెళ్తారు’’ అని బీసీసీఐ వెల్లడించింది. 

బంగ్లాతో చివరి వన్డేకి ముగ్గురు ఆటగాళ్లు దూరం కావడంతో బీసీసీఐ మేనేజ్‌మెంట్‌ టీమ్‌ఇండియాని ప్రకటించింది. తాజాగా కుల్‌దీప్‌ యాదవ్‌ స్క్వాడ్‌లోకి వచ్చాడు. అయితే దీపక్, కుల్దీప్, రోహిత్ లేకపోవడంతో తుది జట్టులో ఎవరు ఉంటారనేది తెలియాలంటే శనివారం వరకు వేచి చూడాల్సిందే. 

భారత్‌: కేఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, శ్రేయస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, షహబాజ్ అహ్మద్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, కుల్‌దీప్‌ యాదవ్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని