వీరే ‘గబ్బా’ర్‌ సింగ్‌లు..!

ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో టీమ్‌ఇండియా తిరుగులేని విజయం అందుకుంది. 328 పరుగుల లక్ష్యాన్ని సునాయసంగా ఛేదించింది. 2-1 తేడాతో బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది. గబ్బా వేదికగా జరిగిన పోరులో భారత కుర్రాళ్లు కసి, పట్టుదలను...

Published : 20 Jan 2021 01:56 IST

అనుభవం కన్నా పట్టుదల, పోరాటమే మిన్న అంటోన్న యువ భారత్‌

ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో టీమ్‌ఇండియా తిరుగులేని విజయం అందుకుంది. 328 పరుగుల లక్ష్యాన్ని సునాయసంగా ఛేదించింది. 2-1 తేడాతో బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది. గబ్బా వేదికగా జరిగిన పోరులో భారత కుర్రాళ్లు కసి, పట్టుదలను ప్రదర్శించారు. అనుభవం కన్నా పోరాటమే మిన్న అని చాటారు. దొరికిన అవకాశాన్ని రెండుచేతులా అందిపుచ్చుకున్నారు. వారికి సీనియర్లు అండగా నిలిచారు. మొత్తానికి 32 ఏళ్ల తర్వాత బ్రిస్బేన్‌లో ఆసీస్‌ జైత్రయాత్రను అడ్డుకొని ‘గబ్బా’ర్‌ సింగ్‌లుగా మారారు.


పంత్‌ టెంపర్‌

ఆ‌ఖరి టెస్టు విజయంలో అందరికీ భాగస్వామ్యం ఉన్నా యువ ఆటగాడు రిషభ్‌ పంత్‌ టెంపర్‌మెంట్‌ మాత్రం అనూహ్యం. కీపింగ్‌, బ్యాటింగ్‌ ప్రాథమిక అంశాల్లో లోపాలు, ఫిట్‌నెస్‌ ఇబ్బందులతో అతడు పరిమిత ఓవర్ల క్రికెట్‌ సిరీస్‌కు ఎంపికే అవ్వలేదు. టెస్టు సిరీసులోనూ దాదాపుగా బ్యాకప్‌ వికెట్‌ కీపర్‌గా స్థానం సంపాదించాడు. సిరీస్‌కు ముందు ఎన్నెన్నో విమర్శలు ఎదుర్కొన్న అతడు గబ్బాలో ‘మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్’ అందుకోవడం ప్రత్యేకం. తొలి ఇన్నింగ్స్‌లో 23 పరుగులు చేసిన పంత్‌ రెండో ఇన్నింగ్స్‌లో మ్యాచ్‌ను గెలిపించాడు. 138 బంతుల్లో 9 బౌండరీలు, 1 సిక్సర్‌తో 89 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మ్యాచ్‌ విజేతగా అవతరించాడు. అత్యంత వేగంగా టీమ్‌ఇండియా తరఫున 1000 పరుగుల మైలురాయి అందుకొని ధోనీ రికార్డు బద్దలుకొట్టాడు.


గిల్‌.. జిల్‌

మంచి టెక్నిక్‌.. కావాల్సినంత ఓపిక.. ఆకట్టుకొనే స్ట్రైక్‌రేట్‌.. యువ ఓపెనర్‌ శుభ్‌మన్ ‌గిల్‌ సొంతం. ఆసీస్‌పై ఛేదనలో అతడు వేసిన పునాది జట్టు విజయానికి బాటలు వేసిందనడంలో సందేహం లేదు. పుజారాతో కలిసి సాధికారికమైన భాగస్వామ్యం అందించాడు. ఆసీస్‌ పేసర్లను ఎదుర్కొంటూ మూడున్నర గంటలు క్రీజులో నిలవడమంటే మాటలు కాదు. అలాంటిది 146 బంతుల్లో 8 బౌండరీలు, 2 సిక్సర్లతో 91 పరుగులు చేయడమంటే శతకం కన్నా ఎక్కువేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు వికెట్‌ పడకుండా అడ్డుకోవడమే కాకుండా వేగంగా పరుగులూ చేశాడు. అండర్‌-19 ప్రపంచకప్‌లో పృథ్వీషా సారథ్యంలో ఆడిన గిల్‌.. ఈ సిరీసులో షా స్థానంలో వచ్చి అదరగొట్టడం ప్రత్యేకం.


అన్నింటా సుందరుడే

సాధారణంగా వాషింగ్టన్‌ సుందర్‌ అంటే టీ20 ఫార్మాట్‌ ఆఫ్‌స్పిన్నర్‌గా భావిస్తుంటారు. అలాంటిది ఆఖరి టెస్టులో అతడి క్రికెట్‌ పరిజ్ఞానం, స్థితప్రజ్ఞతను చూసి అంతా ఆశ్చర్యపోయారు. జడేజా స్థానంలో వచ్చి పూర్తి న్యాయం చేశాడు. అటు బ్యాటు ఇటు బంతితో అదరగొట్టాడు. నిజానికి సుందర్‌ మంచి బ్యాట్స్‌మన్‌. తమిళనాడుకు ఓపెనింగ్‌ చేస్తుంటాడు. ఇక టీఎన్‌పీఎల్‌లో ఓ జట్టుకు సారథి కావడంతో మ్యాచ్‌, పిచ్‌ను అధ్యయనం చేయడంలో ఆరితేరాడు. అందుకు తగ్గట్టుగా ఆడటం అలవాటు చేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 62 పరుగులు చేసి ఆసీస్‌కు ఎక్కువ ఆధిక్యం దక్కనివ్వలేదు. రెండో ఇన్నింగ్స్‌లో వేగంగా 22 పరుగులు చేసి పంత్‌పై ఒత్తిడి తగ్గించాడు. మొత్తంగా టెస్టులో 4 వికెట్లు తీసి తానో విలువైన ఆటగాడినని చాటిచెప్పాడు.


టీమ్‌ఇండియా మియాభాయ్‌

హైదరాబాదీ కుర్రాడు మహ్మద్‌ సిరాజ్‌ ప్రదర్శన గురించి ఎంత చెప్పినా తక్కువే. అనతి కాలంలోనే టీమ్‌ఇండియాకు మియాభాయ్‌గా మారిపోయాడు. సీనియర్లు, కోచ్‌ల సలహాలు పాటిస్తూ అదరగొడుతున్నాడు. ఆఖరి టెస్టులో బౌలింగ్‌ దాడికి నాయకత్వం వహించింది అతడే కావడం ప్రత్యేకం. ఇదే సిరీసులో అరంగేట్రం చేసి ఇదే సిరీసులో బౌలింగ్‌ దళానికి నాయకుడిగా మారడమంటే మాటలు కాదు. గబ్బాలో ఆసీస్‌ను రెండుసార్లు ఆలౌట్‌ చేయడంలో అతడిదే కీలక పాత్ర. మ్యాచ్‌లో 1/77, 5/73తో రాణించాడు. రెండో ఇన్నింగ్స్‌లో కీలకమైన స్టీవ్‌స్మిత్‌, లబుషేన్‌ను పెవిలియన్‌ పంపించాడు. ఐదు వికెట్ల ఘనత అందుకొని మురిసిపోయాడు. తండ్రికి ఘనంగా నివాళి అర్పించాడు. ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌ ముగిశాక చేతిలో బంతి అందుకొని డ్రెస్సింగ్‌ రూమ్‌లో ప్రవేశిస్తున్న సిరాజ్‌కు అద్భుతమైన గౌరవం లభించింది. జాతీయ గీతం వస్తే భావోద్వేగానికి గురయ్యే ఈ హైదరాబాదీ.. జాతీయ జట్టుకు ఆడటానికి ఎంతో ప్రాముఖ్యం ఇస్తాడు.


ధోనీ మార్గనిర్దేశంలో శార్దూల్‌

అరంగేట్రం టెస్టులో పది బంతులు వేసి గాయంతో వెనుదిరిగాడు యువపేసర్‌ శార్దూల్‌ ఠాకూర్‌. రెండోసారి వచ్చిన అవకాశాన్ని మాత్రం రెండు చేతులతో అందిపుచ్చుకున్నాడు. కేవలం బంతితోనే కాకుండా బ్యాటుతోనూ జట్టును ఆదుకున్నాడు. ముంబయిలో పుట్టిపెరిగిన ఈ కుర్రాడు చెన్నై సూపర్‌కింగ్స్‌లో ధోనీ నేతృత్వంలో మెలకువలు నేర్చుకున్నాడు. కీలక సమయాల్లో సరైన లెంగ్తుల్లో బంతులు విసిరి వికెట్లు తీస్తుంటాడు. ఆఖరి టెస్టులోనూ అతడు 3/94, 4/61తో రాణించాడు. ఆసీస్‌ను రెండో ఇన్నింగ్స్‌లో ఆలౌట్‌ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో సుందర్‌తో కలిసి శతక భాగస్వామ్యం నిర్మించాడు. 67, 2తో ఆకట్టుకున్నాడు. ముంబయి సబర్బన్‌ రైలు ప్రయాణికులకు శార్దూల్‌ పరిచయస్థుడే.


పుజారా  సార్‌..  పుజారే

గత పర్యటనలో టీమ్‌ఇండియా హీరో చెతేశ్వర్‌ పుజారా. ఈ సిరీస్‌లో ఆ స్థాయి మెరుపులు లేకపోయినా జట్టుకు అండగా నిలవడంలో మాత్రం వెనుకంజ వేయలేదు. ఆఖరి టెస్టులో అతడు కుర్రాళ్లకు అండగా నిలిచిన తీరు అభినందనీయం. ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌, కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌తో అతడు నెలకొల్పిన భాగస్వామ్యాలు విజయానికి కీలకంగా మారాయి. ఒక రోజులో వికెట్లు వెంటవెంటనే పడకుండా 324 పరుగుల్ని టీమ్‌ఇండియా చేసిందంటే అతడి బ్లాకథాన్‌‌ వ్యూహం పుణ్యమే. తొలి ఇన్నింగ్స్‌లో పుజారా 94 బంతుల్లో 25 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 211 బంతులాడి 56 పరుగులు సాధించాడు. ఇందుకోసం 314 నిమిషాలు అంటే దాదాపుగా 5 గంటలు క్రీజుకు అతుక్కుపోయాడు. అటు గిల్‌.. ఇటు పంత్‌కు మార్గనిర్దేశం చేశాడు. ఆసీస్‌ పేసర్లను పుజారా నిలువరించగా.. మిగతా ఇద్దరూ పరుగులు చేశారు. అలా అతడూ ‘గబ్బార్’‌సింగ్‌గా మారాడు.


నట్టూ.. బిగించాడు

ఇక తమిళనాడు యువ పేసర్‌ తంగరసు నటరాజన్‌ అరుదైన ఘనత అందుకున్నాడు. నెట్‌బౌలర్‌గా ఆసీస్‌లో అడుగుపెట్టి వన్డే, టీ20, టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. అత్యంత కచ్చితత్వంతో యార్కర్లు వేయగల సామర్థ్యం అతడి సొంతం. ఒకే ఓవర్లో ఆరు యార్కర్లూ సంధించగల నేర్పరి. ఆఖరి టెస్టులో 3/78, 0/41తో రాణించాడు. మొత్తంగా 230 బంతులు విసిరి 119 పరుగులు ఇచ్చాడు. గాయపడ్డ నవదీప్‌ సైని బౌలింగ్‌ భారాన్నీ పంచుకొన్నాడు. పొదుపుగా పరుగులిచ్చి ఆసీస్‌ను దెబ్బకొట్టాడు.

-ఇంటర్నెట్‌ డెస్క్‌

ఇవీ చదవండి
గబ్బా కోటకు టీమ్‌ఇండియా బీటలు
ఆసీస్‌ పొగరుకు, గర్వానికి ఓటమిది
భారత్‌ vs ఆస్ట్రేలియా: కొత్త రికార్డులు

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు