IPLకు పాజిటివ్‌

ఐపీఎల్‌పై కరోనా పిడుగు పడింది. దేశంలో కల్లోలం సృష్టిస్తున్న కరోనా.. అత్యంత సురక్షితం అని భావించిన    ఐపీఎల్‌ బయో బబుల్‌నూ విడిచి పెట్టలేదు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌లో ఇద్దరు ఆటగాళ్లకు కరోనా మహమ్మారి సోకింది. అటు చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫ్రాంఛైజీలో ఇద్దరు పాజిటివ్‌గా తేలారు. దిల్లీలో గ్రౌండ్స్‌మెన్‌నూ కొవిడ్‌ వదల్లేదు. మొన్నటి వరకు సాఫీగా సాగిపోయిన ఈ లీగ్‌ ఒక్కసారిగా భారీ కుదుపునకు లోనైంది. సోమవారం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య మ్యాచ్‌ వాయిదా పడింది. ప్రస్తుతానికి ఈ ఒక్క మ్యాచే.  ఇంకొన్ని కేసులు వస్తే మాత్రం మొత్తం లీగే ఆగిపోయే ప్రమాదం ఉంది.

Updated : 04 May 2021 07:12 IST

నైట్‌రైడర్స్‌లో ఇద్దరు ఆటగాళ్లకు కరోనా
కోల్‌కతా, బెంగళూరు మ్యాచ్‌ వాయిదా
చెన్నై కోచ్‌ బాలాజీకి కొవిడ్‌
లీగ్‌ కొనసాగడంపై అనుమానాలు!
దిల్లీ

ఐపీఎల్‌పై కరోనా పిడుగు పడింది. దేశంలో కల్లోలం సృష్టిస్తున్న కరోనా.. అత్యంత సురక్షితం అని భావించిన    ఐపీఎల్‌ బయో బబుల్‌నూ విడిచి పెట్టలేదు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌లో ఇద్దరు ఆటగాళ్లకు కరోనా మహమ్మారి సోకింది. అటు చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫ్రాంఛైజీలో ఇద్దరు పాజిటివ్‌గా తేలారు. దిల్లీలో గ్రౌండ్స్‌మెన్‌నూ కొవిడ్‌ వదల్లేదు. మొన్నటి వరకు సాఫీగా సాగిపోయిన ఈ లీగ్‌ ఒక్కసారిగా భారీ కుదుపునకు లోనైంది. సోమవారం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య మ్యాచ్‌ వాయిదా పడింది. ప్రస్తుతానికి ఈ ఒక్క మ్యాచే.  ఇంకొన్ని కేసులు వస్తే మాత్రం మొత్తం లీగే ఆగిపోయే ప్రమాదం ఉంది.

ప్రపంచకప్‌పై నీలినీడలు

నిజానికి నిరుటి మాదిరే ఈసారి ఐపీఎల్‌ను యూఏఈలో నిర్వహించాలంటూ బీసీసీఐపై అన్ని వైపుల నుంచి ఒత్తిడి వచ్చింది. అయితే ఈ ఏడాది అక్టోబరు- నవంబరులో టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యమివ్వనున్న నేపథ్యంలో భారత్‌ సురక్షితమని క్రికెట్‌ ప్రపంచానికి బోర్డు చెప్పాలనుకుంది. ప్రస్తుత పరిణామాలతో టీ20 కప్పు వేదికను భారత్‌ నుంచి తరలించాలంటూ క్రికెట్‌ ప్రపంచమంతా కోరుకునే పరిస్థితి తలెత్తింది.

ఇక ప్రతి రోజూ పరీక్ష

సోమవారం నాటి కరోనా ప్రకంపనలతో బీసీసీఐ ఆత్మరక్షణలో పడింది. బయో బుడగ అత్యంత సురక్షితమంటూ నమ్మకం కలిగిస్తూ వచ్చిన బోర్డుకు వరుణ్‌, సందీప్‌ల వ్యవహారం తలనొప్పిగా మారింది. అయితే బుడగ నుంచి బయటకు వెళ్లడం వల్లే వీరిద్దరికి కరోనా సోకిందని బోర్డు సర్ది చెప్తుండొచ్చు. బుడగ సురక్షితం కాబట్టి ఐపీఎల్‌ యధావిధిగా నిర్వహించేందుకే మొగ్గు చూపుతుండొచ్చు. కాని ప్రస్తుతం బయో బుడగలో పరిస్థితి గంభీరంగా తయారైంది. విదేశీ ఆటగాళ్ల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఐపీఎల్‌ను వీడాలనుకున్నా.. భారత్‌ నుంచి విమానాలపై నిషేధం కారణంగా స్వదేశం వెళ్లలేని పరిస్థితి వాళ్లది. తాజా పరిణాలతో విదేశీ ఆటగాళ్లలో ఆందోళన మరింత తీవ్రమవడం ఖాయం. ఇక నిర్వాహకులకు ప్రతి రోజూ పరీక్షే. మరొక్క ఆటగాడికి కరోనా సోకినా.. సహాయ సిబ్బందికి పాజిటివ్‌ వచ్చినా పరిస్థితి బీసీసీఐ చేయిదాటినట్లే. అప్పుడు ఐపీఎల్‌ను నిరవధికంగా వాయిదా వేయడం లేదా రద్దు చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. వేల కోట్ల రూపాయల వాణిజ్య ఒప్పందాలతో ముడిపడి ఉన్న ఐపీఎల్‌ను రద్దు చేసే సాహసం బీసీసీఐ చేయకపోవచ్చు కాబట్టి వాయిదా వేసే అవకాశాలే ఎక్కువ. అదే జరిగితే మిగతా ఐపీఎల్‌ను, టీ20 ప్రపంచకప్‌ను యూఏఈలో నిర్వహించే అవకాశాలే అధికం. అక్టోబరు- నవంబరుకు ముందు సెప్టెంబరులో ఐపీఎల్‌కు సరైన సమయం. ఐపీఎల్‌ ఆడటాన్ని అత్యధిక జట్లు టీ20 ప్రపంచకప్‌కు మ్యాచ్‌ ప్రాక్టీస్‌గా భావిస్తాయి.

ఏం జరిగింది

సోమవారం రాత్రి అహ్మదాబాద్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ వాయిదా పడింది. కోల్‌కతా ఆటగాళ్లు వరుణ్‌ చక్రవర్తి, సందీప్‌లు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐపీఎల్‌ ప్రకటించింది. గత నాలుగు రోజుల్లో నిర్వహించిన పరీక్షల్లో మూడో రౌండ్లో వీరిద్దరికి పాజిటివ్‌గా వచ్చింది. వీరిద్దరిని మిగతా జట్టు నుంచి వేరు చేసి ఐసోలేషన్‌కు తరలించారు.

ఎలా సోకింది!

బయో బుడగ నుంచి బయటకు రావడంతో వరుణ్‌, సందీప్‌లు కరోనా బారినపడ్డారు. గాయాల పాలైన వరుణ్‌, సందీప్‌లను స్కానింగ్‌ కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడే వారు మహమ్మారి బారిన పడివుండొచ్చని అనుమానిస్తున్నారు. 48 గంటల కింది నుంచి వారిద్దరితో సన్నిహితంగా మెలిగిన వారందరి ఆరోగ్య పరిస్థితిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇక నుంచి కోల్‌కతా శిబిరంలో ఆటగాళ్లకు ప్రతిరోజూ ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతానికి మిగతా ఆటగాళ్లందరికీ కరోనా పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చింది. సందీప్‌ లీగ్‌లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌లోనూ ఆడలేదు. వరుణ్‌ కోల్‌కతా ఆడిన ఏడు మ్యాచ్‌ల్లోనూ బరిలో దిగాడు. ఏప్రిల్‌ 29న అహ్మదాబాద్‌లో దిల్లీ క్యాపిటల్స్‌తో కోల్‌కతా తలపడింది. ఆ మ్యాచ్‌లో వరుణ్‌తో సన్నిహితంగా ఉన్న దిల్లీ ఆటగాళ్లకూ కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. యాప్‌ గడియారం   ఆధారంగా సందీప్‌కు దగ్గరగా వచ్చిన వాళ్ల సమాచారాన్ని సేకరిస్తున్నారు.

ఆ రెండు మ్యాచ్‌లు?

కోల్‌కతా ఆటగాళ్లలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ రావడంతో బెంగళూరు, కోల్‌కతా మధ్య మ్యాచ్‌ను వాయిదా వేశారు. కోల్‌కతా ఆరు రోజుల కఠిన క్వారంటైన్‌లోకి వెళ్లింది. ఆ జట్టుతో చివరగా ఆడిన దిల్లీ కూడా క్వారంటైన్‌లో ఉంది. ఈ రెండు జట్లు తిరిగి 8వ తేదీనా మ్యాచ్‌ ఆడనున్నాయి. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే దిల్లీలో మ్యాచ్‌లు సాగేది అనుమానంగా మారింది. కారణం చెన్నై బౌలింగ్‌ కోచ్‌ బాలాజీకి పాజిటివ్‌ రావడమే. ముంబయితో మ్యాచ్‌ సందర్భంగా బాలాజీ చెన్నై డగౌట్‌లో ఉన్నాయి. చెన్నైతో పాటు ముంబయి ఆటగాళ్లతోనూ అతడు మాట్లాడాడు. మంగళవారం దిల్లీలో ముంబయి, హైదరాబాద్‌ జట్లు తలపడనున్నాయి. బుధవారం చెన్నై, రాజస్థాన్‌ మధ్య మ్యాచ్‌ జరగాల్సివుంది. ఈ రెండు మ్యాచ్‌లకు అనుమతి ఇస్తారా లేదా వాయిదా వేస్తారా అన్నది చూడాలి.

ఆందోళనలో ఆటగాళ్లు

కరోనా కలకలంతో ఆటగాళ్లలో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. భారత్‌లో కరోనా తీవ్రత నేపథ్యంలో కొందరు విదేశీ ఆటగాళ్లు స్వదేశానికి వెళ్లిపోయినా.. బయో బుడగ అత్యంత సురక్షితమంటూ బీసీసీఐ చెబుతూ వస్తోంది. కోల్‌కతా, చెన్నై బృందాల్లో కరోనా కేసులు వెలుగు చూడటంతో ప్రత్యేకించి విదేశీ ఆటగాళ్లలో భయాందోళనలు ప్రారంభమయ్యాయి. టోర్నీ మొదట్లో అక్షర్‌ పటేల్‌, దేవ్‌దత్‌ పడిక్కల్‌లు పాజిటివ్‌గా తేలినా పెద్దగా ఆందోళన తలెత్తలేదు. ఇటీవలి ప్రయాణాలతో అందరిలోనూ గుబులు మొదలైంది. గతవారం ఐపీఎల్‌ జట్లు దిల్లీ, అహ్మదాబాద్‌లకు వచ్చిన తర్వాతే ఈ పరిస్థితి వచ్చిందని ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. తర్వాతి దశలో కోల్‌కతా, బెంగళూరు వేదికల్లో ఐపీఎల్‌ జరుగనుంది.

ఆ కోచ్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌లో

కరోనా కారణంగా బెంగళూరు, కోల్‌కతాల మధ్య మ్యాచ్‌ వాయిదా పడిన కొద్దిసేపటికే మరో బాంబు పేలింది. దిల్లీలో ఉన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ బృందంలో ముగ్గురు పాజిటివ్‌గా తేలారు. జట్టు సీఈఓ కాశీ విశ్వనాథన్‌, బౌలింగ్‌ కోచ్‌ లక్ష్మీపతి బాలాజి, బస్సు క్లీనర్‌లకు ఆదివారం నిర్వహించిన ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చింది. శనివారం ముంబయి ఇండియన్స్‌తో మ్యాచ్‌లో బాలాజి చెన్నై డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉన్నాడు. దీంతో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. జట్టులోని ఆటగాళ్లెవరికీ పాజిటివ్‌ రాలేదు. సోమవారం మరోసారి కరోనా పరీక్ష నిర్వహించగా వీరందరికీ నెగెటివ్‌ వచ్చిందని మొదట వార్తలొచ్చాయి. కానీ విశ్వనాథన్‌ మినహాయిస్తే మిగతా ఇద్దరికి ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షలో మరోసారి పాజిటివ్‌ వచ్చినట్లు తేలింది. ప్రస్తుతం దిల్లీలో ఉన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు సోమవారం ప్రాక్టీస్‌ను రద్దు చేసుకుంది.
గ్రౌండ్స్‌మెన్‌కూ కరోనా: దిల్లీలోని ఫిరోజ్‌ షా కోట్లా స్టేడియంలోని కొంతమంది గ్రౌండ్స్‌మెన్‌ పాజిటివ్‌గా తేలారు. మంగళవారం ముంబయి ఇండియన్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్ల మధ్య కోట్లాలో మ్యాచ్‌ జరుగనుంది. అయితే కరోనా పాజిటివ్‌గా తేలిన వాళ్లలో ఎవరూ విధుల్లో లేరని డీడీసీఏ అధ్యక్షుడు రోహన్‌ జైట్లీ తెలిపాడు

వెనక్కి తగ్గేదే లేదు

కరోనా  ఐపీఎల్‌ను బెంబేలెత్తిస్తోన్నా వెనక్కి తగ్గేది లేదని ఫ్రాంఛైజీలు స్పష్టం చేస్తున్నాయి. ‘‘ఇప్పటికే సగం సీజన్‌ పూర్తయిన నేపథ్యంలో ఇప్పుడు వెనక్కి తగ్గేది లేదు. ఆటగాళ్లకు పాజిటివ్‌గా తేలడంతో ఇప్పుడు బీసీసీఐ పని మరింత సవాలుగా మారనుంది. స్కానింగ్‌ కోసం బబుల్‌ బయటకు తీసుకెళ్లడంతోనే ఆటగాడికి వైరస్‌ సోకినట్లు తెలుస్తోంది. బబుల్‌ బయట అలా జరిగే వీలుంది. ఇప్పటివరకైతే బీసీసీఐ విధించిన నిబంధనలను అందరూ కఠినంగా పాటిస్తున్నారు. ఎలాంటి ఉల్లంఘనలు లేవు’’ అని ఓ ఫ్రాంఛైజీ ప్రతినిధి తెలిపాడు. ‘‘ఒకవేళ టోర్నీని ఆపాలంటే ఎన్ని రోజులు పాటు అది సాధ్యమవుతుంది? పాజిటివ్‌ వచ్చిన ఆటగాళ్లను ఐసోలేషన్‌లో పెట్టి సీజన్‌ కొనసాగించడం ఒక్కటే మార్గం. ఆటగాళ్లు ఇప్పుడు ఆందోళనలో ఉన్నారు. కానీ ఇళ్లకు ఎలా చేరతామనేదే అందుకు ప్రధాన కారణం’’ అని మరో జట్టు ప్రతినిధి చెప్పాడు. ‘‘మా అందరికీ ఏది ఉత్తమమో నిర్ణయించే అవకాశం బీసీసీఐకే వదిలేయాలి. కేకేఆర్‌ ఆటగాళ్లకు వైరస్‌ సోకిన నేపథ్యంలో ఇలా చేయాలంటూ.. అలా చేయాలంటూ అందరూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తే అది మరింత గందరగోళానికి దారితీస్తుంది’’ అని ఇంకో ఫ్రాంఛైజీ ప్రతినిధి పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని