పాకిస్థాన్‌పై ఆధిపత్యానికి కారణమేంటంటే..

టీ20 ప్రపంచకప్‌ మొదలైన నేపథ్యంలో చర్చంతా భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌పైనే. అందరి చూపూ ఆటువైపే. పాక్‌ ఇప్పటివరకు వన్డే ప్రపంచకప్‌లో గానీ, టీ20 ప్రపంచకప్‌లో గానీ భారత్‌ను ఓడించలేదు.

Published : 20 Oct 2021 04:00 IST

దిల్లీ: టీ20 ప్రపంచకప్‌ మొదలైన నేపథ్యంలో చర్చంతా భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌పైనే. అందరి చూపూ ఆటువైపే. పాక్‌ ఇప్పటివరకు వన్డే ప్రపంచకప్‌లో గానీ, టీ20 ప్రపంచకప్‌లో గానీ భారత్‌ను ఓడించలేదు. ఇప్పుడు టీమ్‌ఇండియా మెగా టోర్నీల్లో పాక్‌పై తన ఆధిక్యాన్ని 13-0కు పెంచుకోవాలనే పట్టుదలతో ఉండగా.. భారత్‌పై తొలి విజయం కోసం పాక్‌ ఆరాటపడుతోంది. ఈ రెండు జట్ల మధ్య ఈ నెల 24న జరగబోయే పోరు ఆసక్తి రేపుతున్న నేపథ్యంలో టీమ్‌ ఇండియా మాజీ ఓపెనర్‌ సెహ్వాగ్‌ స్పందించాడు. ఈ జట్ల మధ్య మ్యాచ్‌ అంటే చర్చలు, అభిమానుల యుద్ధాలు మామూలేనని.. భారత జట్టును ఓడించడానికి అవసరమైన సామర్థ్యం ప్రస్తుత పాక్‌ జట్టులోని ఆటగాళ్లకుందని అన్నాడు. ‘‘భారత్‌, పాకిస్థాన్‌ జట్ల మధ్య ప్రపంచకప్‌ మ్యాచ్‌ అంటే విపరీతమైన ఆసక్తి మామూలే. ప్రపంచకప్‌లో భారత్‌పై పాకిస్థాన్‌ ఒక్కసారి కూడా గెలవలేకపోయిందన్న చర్చ కూడా చాలా ఏళ్లుగా జరుగుతున్నదే. అయితే వన్డే క్రికెట్లో బాగా ఆడకపోయినా.. టీ20 క్రికెట్లో పాకిస్థాన్‌కు మెరుగైన అవకాశాలే ఉంటాయి. ఈ ఫార్మాట్లో ఒక్క ఆటగాడే ఏ జట్టునైనా ఓడించగలడు. అయినా ఇప్పటివరకు పాక్‌ ఆ పని చేయలేకపోయింది. 24న ఏం జరుగుతుందో చూద్దాం’’ అని చెప్పాడు. ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కోవడం, పాకిస్థాన్‌లా వ్యాఖ్యలు చేయకపోవడమే ఆ జట్టుపై భారత్‌ ఆధిపత్యానికి కారణమని అన్నాడు. ‘‘2011, 2003 ప్రపంచకప్‌లనే తీసుకుందాం. అప్పుడు మేం తక్కువ ఒత్తిడిలో ఉన్నాం. ఎందుకంటే ప్రపంచకప్‌లో పాక్‌పై మాది మెరుగైన స్థితి. మేం ఎప్పుడూ పట్టుదలతో ఆడతాం. ఎప్పుడూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడం’’ అని సెహ్వాగ్‌ చెప్పాడు. ‘‘పాకిస్థాన్‌ వాళ్లు ఎప్పుడూ పెద్ద ప్రకటనలు చేస్తుంటారు. భారత్‌ ఏనాడూ అలా చేయలేదు. ఎందుకంటే ఆ జట్టు మ్యాచ్‌కు మెరుగ్గా సిద్ధమవుతుంది. మెరుగ్గా సిద్ధం కావడం వల్ల.. ఫలితం ఎలా ఉండబోతుందో ఆ జట్టుకు ముందే తెలుస్తుంది’’ అని అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని