40 ఓవర్లు ఇలా ఆడితే.. ప్రపంచకప్‌లో అంతే! 

గతరాత్రి టీమ్‌ఇండియాతో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లాండ్‌ గెలవడంతో ఆ జట్టు మాజీ సారథి మైఖేల్‌ వాన్‌ సంతోషం వ్యక్తం చేశాడు. అలాగే టీమ్‌ఇండియాపై తీవ్ర విమర్శలు చేశాడు...

Updated : 27 Mar 2021 14:19 IST

టీమ్‌ఇండియాపై మైఖేల్‌ వాన్‌ సెటైర్లు..

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియాతో నిన్న జరిగిన రెండో వన్డేలో ఇంగ్లాండ్‌ గెలవడంతో ఆ జట్టు మాజీ సారథి మైఖేల్‌ వాన్‌ సంతోషం వ్యక్తం చేశాడు. ఇది కోహ్లీసేనకు గుణపాఠం అని విమర్శలు చేశాడు. మ్యాచ్‌ అనంతరం రెండు ట్వీట్లు చేసిన వాన్‌.. భారత్‌ 40 ఓవర్ల పాటు నెమ్మదిగా బ్యాటింగ్‌ చేయడం.. రెండేళ్లలో స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్‌లో నష్టం కలిగిస్తుందని అభిప్రాయపడ్డాడు. ఇలాంటి ఫ్లాట్‌ వికెట్లపై 375కి పైగా స్కోర్‌ సాధించే సత్తా టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ లైనప్‌కు ఉందన్నాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాటింగ్‌ విధానం బాగుందని, ఇలాంటి దూకుడుతో ఆధిపత్యం చెలాయిస్తుందని మెచ్చుకున్నాడు. మరోవైపు భారత బౌలింగ్‌ బాగోలేదని, కోహ్లీ ఇప్పుడు అత్యుత్తమ బౌలర్లతో బౌలింగ్‌ చేయించాలని వాన్‌ సూచించాడు.

పుణె వేదికగా జరిగిన డే/నైట్‌ వన్డేలో టీమ్‌ఇండియా తొలుత బ్యాటింగ్‌ చేసి 336/6 భారీ స్కోర్‌ సాధించింది. తొలి 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 41 పరుగులు చేసిన భారత్‌.. 40 ఓవర్లకు 210/3తో నిలిచింది. ఈ క్రమంలోనే చివరి 10 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 126 పరుగులు సాధించింది. ఆదిలో శిఖర్‌ ధావన్‌(4), రోహిత్‌ శర్మ(25) విఫలమైన నేపథ్యంలో కోహ్లీ(66), కేఎల్‌ రాహుల్‌(108) జాగ్రత్తగా ఆడారు. వీరిద్దరూ వికెట్ కాపాడుకునేందుకు తొలి ప్రాధాన్యం ఇచ్చారు. ఈ క్రమంలోనే మూడో వికెట్‌కు 121 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఇక 32వ ఓవర్‌ చివరి బంతికి కోహ్లీ ఔటైన తర్వాత కూడా టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ శైలిలో మార్పు రాలేదు. రాహుల్‌తో జోడీ కట్టిన పంత్‌(77) తొలుత కాస్త నిదానంగా ఆడాడు. అలా 40 ఓవర్ల వరకు స్కోరుబోర్డు నెమ్మదిగా సాగింది. ఆపై పంత్‌, హార్దిక్‌పాండ్య(35) సిక్సర్లతో చెలరేగడంతో జట్టు స్కోర్‌ పరుగులు పెట్టింది. ఈ నేపథ్యంలోనే టీమ్‌ఇండియా అతిజాగ్రత్త బ్యాటింగ్‌ పద్ధతిపై వాన్‌ విమర్శలు గుప్పించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని