PV Sindhu : ఒలింపిక్స్‌పై ప్రభావం పడకూడదనే ఆ అకాడమీ నుంచి వచ్చేశా: సింధు

లింపిక్‌ పతకాల విజేత, తెలుగు తేజం పూసర్ల వెంకట సింధు ఇటీవలే కామన్వెల్త్‌గేమ్స్‌లో స్వర్ణ పతకం గెలిచిన విషయం తెలిసిందే. తొలిసారి అలీతో సరదాగా షోకు అతిథిగా...

Updated : 23 Aug 2022 15:13 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఒలింపిక్‌ పతకాల విజేత, తెలుగు తేజం పూసర్ల వెంకట సింధు ఇటీవలే కామన్వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణ పతకం గెలిచిన విషయం తెలిసిందే. తొలిసారి అలీతో సరదాగా షోకు అతిథిగా విచ్చేసింది. తనకిష్టమైన పలు అంశాలపై మాట్లాడింది.  క్రీడల్లో స్ఫూర్తినిచ్చేది తన తండ్రి అని.. అయితే బ్యాడ్మింటన్‌ ఆడాలనే కోరిక మాత్రం తనదేనని వెల్లడించింది. అలాగే ఒలింపిక్స్‌ ముందు వరకు కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుని.. ఆ తర్వాత అకాడమీ నుంచి బయటకు వెళ్లిపోవడం, విభేదాలపైనా పీవీ సింధు స్పందించింది. 

‘‘నా మొదటి గురువు మహబూబ్‌ అలీ. ఆయన వద్ద తొలిసారి బ్యాడ్మింటన్‌ కోచింగ్‌ తీసుకున్నా. తర్వాత ఆరిఫ్, గోవర్థన్‌, గోపీ సర్‌ వద్ద నేర్చుకున్నా. గోపీచంద్‌ వద్ద చాలా ఏళ్లు కోచింగ్‌ తీసుకున్నా. ప్రతి కోచ్‌ వద్ద నేర్చుకునేందుకు చాలా విషయాలు ఉంటాయి. ఇండోనేషియా, కొరియా నుంచి వచ్చిన కోచ్‌ల వద్ద కూడా నేర్చుకున్నా. ఇప్పుడు కొరియాకు చెందిన పార్క్ వద్ద కోచింగ్‌ తీసుకుంటున్నా. మెడల్‌ కోసం పోడియంపై నిల్చుని మన జాతీయ జెండా, జాతీయ గీతం వింటూ ఉంటే అనిర్వచనీయ అనుభూతి కలుగుతుంది. ప్రతి ప్లేయర్‌తో ఎప్పుడూ టఫ్‌గా ఆడతా. నేను వందశాతం కష్టపడతా. అయితే ఒక్కో రోజు మనది కాకపోవచ్చు. క్రీడల్లో గాయాలు చాలా కామన్‌గా జరుగుతుంటాయి. 2015లో నొప్పితోనే ఆరు నెలలు ఆడా. విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో ఒలింపిక్స్‌కు ముందు దాదాపు ఆరు నెలలు విశ్రాంతి తీసుకున్నా. టాప్‌-16లో ఉంటేనే ఒలింపిక్స్‌లో ఆడే అర్హత లభిస్తుంది. దాని కోసం విరామం తీసుకుని మరీ 23 టోర్నమెంట్లు ఆడి ర్యాంక్‌ను మెరుగుపరుచుకున్నా. ఆ తర్వాత తొలి ఒలింపిక్స్‌లోనే పతకం సాధించా’’

ఆ అకాడమీలో కొన్ని నచ్చలేదు

‘‘ఆ అకాడమీలో చాలా సంవత్సరాలు ఆడాను. అయితే అక్కడ కొన్ని విషయాలు నచ్చలేదు. ఎందుకో అవి నాకు నప్పవని అనిపించింది. ఒలింపిక్స్‌ ముందు ఫోకస్‌ పక్కకు జరగకుండా ఉండాలని బయటకు వచ్చేశా. అకాడమీలో ఉన్నప్పుడు కూడా వేర్వేరు కోచ్‌ల వద్ద ఆడా. ప్లేయర్‌కు కేవలం గేమ్‌ మీదనే దృష్టి ఉండాలి. అందుకే వాటన్నింటికీ దూరంగా ఉండాలనే కారణంతోనే బయటకు వచ్చా. పాజిటివ్‌గా ఉండాలని ఎప్పుడూ అనుకుంటూ ఉంటా. అలా చివరికి అకాడమీ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నా.  నేను ఎంత సంపాదించినా, ఎన్ని మెడల్స్ సాధించినా ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉంటా. భారత్‌ కోసం ఇంకా చాలా గెలవాలని అనుకుంటూ ఉంటా’’ అని సింధు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని