
చేతులు కట్టుకుని.. తలదించుకుని కూర్చున్నా
ఎన్టీఆర్ వర్సిటీ వీసీ శ్యాంప్రసాద్ ఆవేదన
ఈనాడు, అమరావతి: ‘నెల రోజులుగా ప్రతి రోజూ మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 10గంటల వరకు ప్రభుత్వ పెద్దల దగ్గరే ఏడ్చాను. నిధుల మళ్లింపుపై నేనేం చెప్పడానికి వీల్లేకుండా.. నా చేతులు కట్టుకుని, తలదించుకుని వారి ఎదుట కూర్చునేలా చేశారు. నేనో దళితుడిననో, ఇంకేదో చెప్పి చేసే వ్యవహారం కాదిది. ఈ విషయంలో దేవుడు మంచి చేస్తాడనే అనుకుంటున్నాను....’ అంటూ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ శ్యాంప్రసాద్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తదితరులు వీసీని ఆయన కార్యాలయంలో శుక్రవారం కలిశారు. నిధుల మళ్లింపుపై ప్రశ్నించగా అది తన చేతుల్లో లేదంటూ అసక్తత వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవాళ్లు వ్యవస్థ కోసం నిలబడాలి కదా అని ఎన్జీవో నేత విద్యాసాగర్ అడగగా... ‘వ్యవస్థ కోసం నిలబడాల్సిందే కానీ.. నన్ను కాళ్లు చేతులు కదలకుండా చేసి నిలబెట్టి ఇదా.. అదా.. ఏదో ఒకటి తేల్చుకోమంటే నేను ఏం చేయాలి.’.. అని వీసీ శ్యాం ప్రసాద్ పేర్కొన్నారు.