
KRMB: ఈ నెల 14లోగా స్పష్టమైన నిర్ణయం: రజత్ కుమార్
హైదరాబాద్: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) సమావేశంలో కొత్తగా ఏ నిర్ణయాలు తీసుకోలేదని తెలంగాణ నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ అన్నారు. హైదరాబాద్లోని జలసౌధలో ఇవాళ కేఆర్ఎంబీ ఛైర్మన్ ఎం.పి.సింగ్ నేతృత్వంలో సమావేశం నిర్వహించారు. ఇందులో ఏపీ, తెలంగాణ అధికారులు పాల్గొన్న విషయం తెలిసిందే. సమావేశం అనంతరం రజత్కుమార్ మీడియాతో మాట్లాడారు. ‘‘విద్యుదుత్పత్తికి అనుమతి ఇవ్వాలని ఏపీ అడుగుతోంది. ఈ నెల 14లోగా స్పష్టమైన నిర్ణయం వెల్లడిస్తాం. మా నిర్ణయాన్ని కేంద్రానికి, ఏపీకి త్వరలో చెబుతాం. ప్రాజెక్టులకు రుణాల గురించి ఏమీ చర్చించలేదు’’ అని అన్నారు.
‘‘విద్యుత్ ఉత్పత్తి అధికారం ఇవ్వాలని కోరాం. ప్రొటోకాల్ ప్రకారం అనధికారికంగా విద్యుదుత్పత్తి చేయకూడదని చెప్పాం. సాగర్, శ్రీశైలం విద్యుత్ ప్రాజెక్టుల గురించి బోర్డ్ ఛైర్మన్ చర్చించారు. అన్ని ప్రాజెక్టుల డీపీఆర్లు ఇచ్చేందుకు సిద్ధం’’ ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు అన్నారు.