సంక్షిప్త వార్తలు

రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో శుక్ర, శనివారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ గురువారం తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని పేర్కొంది. బుధవారం ఉదయం నుంచి

Updated : 24 Jun 2022 05:41 IST

నేడు, రేపు ఉరుములతో వర్షాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో శుక్ర, శనివారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ గురువారం తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని పేర్కొంది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు కొన్నిచోట్ల వర్షాలు కురిశాయి. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం సముద్రాలలో 6.1 సెంటీమీటర్లు, కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్‌లో 5.2, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలం సత్వార్‌లో 3.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది.


ఎస్సీ గురుకులాల్లో జీవో 317 అమలుకు హామీ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఎస్సీ గురుకులాల్లో జీవో నం.317ను అమలు చేసేందుకు గురుకుల సొసైటీ కార్యదర్శి రొనాల్డ్‌రాస్‌ హామీ ఇచ్చారని తెలంగాణ ప్రభుత్వ గురుకుల విద్యాలయాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.అంజయ్య తెలిపారు. అలాగే, పాఠశాలలను ఉదయం 9 గంటల నుంచి 4.30 వరకు కొనసాగించేలా ఒప్పుకొన్నారని వివరించారు. ఎస్సీ గురుకులాల్లో పనిచేస్తున్న టీచర్ల సమస్యలపై ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌రెడ్డితో కలిసి గురువారం సంఘం సభ్యులు గురుకుల సొసైటీ కార్యదర్శితో చర్చించారు. 2016 నుంచి ఏర్పాటైన పాఠశాలలు, డిగ్రీ కళాశాలలను పక్కాభవనాల్లో కొనసాగించాలని కోరారు. మెస్‌ఛార్జీలు, అతిథి అధ్యాపకులు, టీచర్ల వేతనాలు పెంచాలని విజ్ఞప్తి చేశారు. కాంట్రాక్టు టీచర్లను క్రమబద్ధీకరించాలని, టీచర్లకు పదోన్నతులు కల్పించాలని తెలిపారు. ఆయా డిమాండ్లపై గురుకుల సొసైటీ కార్యదర్శి సానుకూలంగా స్పందించారని సంఘం నాయకులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో గురుకుల సొసైటీ అదనపు కార్యదర్శి హన్మంతు నాయక్‌, సంఘం ప్రధాన కార్యదర్శి వై.పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గురుకుల సీఆర్‌టీల వేతనాలు పెంపు

పాఠశాల విద్యాశాఖ పరిధిలోని తెలంగాణ గురుకుల విద్యాసంస్థ(టీఆర్‌ఈఐ)ల్లో పనిచేస్తున్న 111 మంది కాంట్రాక్టు రెసిడెన్షియల్‌ టీచర్ల(సీఆర్‌టీ)కు వేతనాలు పెరగనున్నాయి. 2020 వేతన సంఘం ప్రకారం వారికి జీతాలు చెల్లించేలా విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ గురువారం జీవో జారీ చేశారు.


పురపాలికలకు రూ.58 కోట్లు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 142 పట్టణ స్థానిక సంస్థలకు జూన్‌ నెలకు రూ.58.08 కోట్ల పట్టణ ప్రగతి నిధులను విడుదల చేస్తూ పురపాలక శాఖ డైరెక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో జీహెచ్‌ఎంసీకి రూ.30.55 కోట్లు, మిగిలిన పురపాలికలకు రూ.27.53 కోట్లను విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


బదిలీలు చేపట్టకపోతే 5న ముట్టడి: జాక్టో

ఈనాడు, హైదరాబాద్‌: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించి ఈ నెల 30లోపు కాలపట్టికను ఇవ్వని పక్షంలో జులై 5న పాఠశాల విద్యాశాఖ సంచాలక కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి(జాక్టో) ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఎస్‌టీయూ భవన్‌లో గురువారం జాక్టో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జాక్టో నాయకులు జి.సదానందంగౌడ్‌, ఎం.పర్వత్‌రెడ్డి, పి.చంద్రశేఖర్‌, కె.వెంకట్‌, గౌరీశంకర్‌, భుజంగరావు తదితరులు పాల్గొన్నారు.


ఇంటర్‌ ఫలితాల రోజే జవాబుపత్రాల స్కానింగ్‌ కాపీ!

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటర్‌ ఫలితాలు వెల్లడైన రోజునే విద్యార్థులు రాసిన జవాబుపత్రాలను పొందగలిగే దిశగానే ఇంటర్‌బోర్డు ఆలోచన చేస్తోంది. జవాబుపత్రాలను బోర్డు వెబ్‌సైట్లో ఉంచాలని భావిస్తోంది. అప్పుడు విద్యార్థులు వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకొని మార్కుల కేటాయింపులో అన్యాయం జరిగిందని భావిస్తే పునఃపరిశీలనకు దరఖాస్తు చేస్తారన్నది ఉద్దేశం. ఈ నెల 25నే ఫలితాలు ఇచ్చేందుకు బోర్డు సమాయత్తమవుతోంది. ఈ విద్యా సంవత్సరం 100 శాతం సిలబస్‌ ఉంటుందని బోర్డు కార్యదర్శి జలీల్‌ కొద్ది రోజుల క్రితమే వెల్లడించారు.


కొత్తగా 494 కొవిడ్‌ కేసులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 494 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 7,97,632కు పెరిగింది. తాజాగా మరో 126 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 7,90,473 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఈ నెల 23న సాయంత్రం 5.30 గంటల వరకు నమోదైన కరోనా సమాచారాన్ని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు గురువారం వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,048 మంది కొవిడ్‌తో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గురువారం 28,865 నమూనాలను పరీక్షించగా.. మొత్తం పరీక్షల సంఖ్య 3,54,24,340కి పెరిగింది. తాజా ఫలితాల్లో హైదరాబాద్‌లో 315, రంగారెడ్డి జిల్లాలో 102, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 31 పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి. రాష్ట్రంలో మరో 18,047 కొవిడ్‌ టీకా డోసులను పంపిణీ చేశారు.


స్వచ్ఛంద పదవీ విరమణకు నల్గొండ సీఈ దరఖాస్తు!

ఈనాడు, హైదరాబాద్‌: నీటిపారుదల శాఖ నల్గొండ సీఈ మున్నలూరి శ్రీకాంత్‌రావు వీఆర్‌ఎస్‌ కింద స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. ఆయన చేసుకున్న విజ్ఞప్తికి నీటి పారుదల శాఖ ఆమోదం తెలిపినట్లు తెలిసింది. మరోవైపు ఈ జిల్లాలో ఉన్న నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు కింద వానాకాలం పంటల సాగుకు ఇబ్బంది రాకుండా సీఈ బాధ్యతలను మరొకరికి అప్పగించేందుకు శాఖ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని