రాష్ట్రంపై కేంద్రం ఆర్థిక ఆంక్షలు

శత్రుదేశాలపై కక్షగట్టి ఆంక్షలు పెట్టినట్లుగా తెలంగాణపై కేంద్రం ఆర్థిక ఆంక్షలు విధిస్తోందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు.

Published : 01 Apr 2023 05:17 IST

అయినా.. సుస్థిర అభివృద్ధిని సాధిస్తున్న తెలంగాణ
ఉత్తమ పంచాయతీలకు అవార్డుల ప్రదానోత్సవంలో మంత్రి కేటీఆర్‌

రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: శత్రుదేశాలపై కక్షగట్టి ఆంక్షలు పెట్టినట్లుగా తెలంగాణపై కేంద్రం ఆర్థిక ఆంక్షలు విధిస్తోందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. ఆర్థిక సంవత్సరం మధ్యలో ఎఫ్‌ఆర్‌బీఎం చట్టంలో నిబంధనలు మార్చి రూ.20 వేల కోట్ల మేర కేంద్ర ప్రభుత్వం కోత విధించిందని విమర్శించారు. రాజకీయంగా భారాసపై ఉన్న వైరాన్ని భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలపై చూపిస్తోందని ఆరోపించారు. రాష్ట్రాన్ని కేంద్రం ఎంతగా సతాయిస్తున్నా తెలంగాణ మాత్రం దేశంలో సుస్థిర అభివృద్ధి సాధిస్తూ నంబర్‌ వన్‌ రాష్ట్రంగా నిలిచిందన్నారు. 2021-22లో రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పంచాయతీలకు అవార్డుల ప్రదానోత్సవాన్ని శుక్రవారం హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఇటీవల ఓ సంస్థ చేపట్టిన సర్వేలో అభివృద్ధిలో మొదటి స్థానం, అవినీతిలో చివరి స్థానంలో నిలిచిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. కేంద్రం ప్రకటించిన అనేక అవార్డుల్లో రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలుస్తోందన్నారు. గ్రామాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉన్న అవగాహనతోనే ఇలాంటి విజయాలు సాధిస్తున్నామన్నారు. గ్రామ పంచాయతీలకు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తెచ్చేందుకు రూ.70 కోట్లతో కంప్యూటర్లు, స్కానర్లు అందజేస్తామని మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు. ప్రభుత్వ విధానాలతో రాష్ట్రంలో భూమి విలువ పెరిగిందని, ఏ మారుమూల ప్రాంతంలోనైనా ఎకరా రూ.10 లక్షలకు పైనే ఉందని అన్నారు.

రూ.3.17 లక్షలకు చేరిన తలసరి ఆదాయం

తెలంగాణ ఏర్పడిన కొత్తలో తలసరి ఆదాయం 1.24 లక్షలుండగా.. ప్రస్తుతం రూ.3.17 లక్షలకు చేరిందని కేటీఆర్‌ వివరించారు. గ్రామాల అభివృద్ధికి కష్టపడుతున్న సర్పంచులు, కార్యదర్శులతో పాటు ఇతర అధికారులను ఆయన అభినందించారు. నవంబరు వరకు గ్రామాల్లో జరిగిన పనులకు రూ.1,300 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. మరో రూ.250 కోట్లను త్వరలో మంజూరు చేసేలా ఆర్థికమంత్రితో మాట్లాడతామని అన్నారు. ఉత్తమ పంచాయతీలకు ప్రత్యేక నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని కేటీఆర్‌ అన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ... గ్రామాల్లో సాధిస్తున్న అభివృద్ధిని చూసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ తరచూ అభినందిస్తున్నారని, ఈ ఘనత క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వారికే దక్కుతుందన్నారు. దేశంలో 100 పంచాయతీలకు అవార్డులివ్వాలని కేంద్ర ప్రభుత్వం తొలుత నిర్ణయించిందని.. కానీ వాటిలో 99 తెలంగాణకే దక్కే అవకాశం ఉండటంతో వెంటనే అవార్డులను 20కి కుదించిందని అన్నారు. ఆ 20లోనూ 19 అవార్డులు తెలంగాణకే దక్కడం రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమమన్నారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధిలో దేశంలోనే ఎర్రబెల్లి దయాకర్‌రావు ఘనత సాధిస్తున్నారని, ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పేరొస్తుందన్నారు. ఈ సందర్భంగా పల్లె ప్రగతి పుస్తకాన్ని మంత్రి కేటీఆర్‌ ఆవిష్కరించారు. ఎంపికైన ఉత్తమ పంచాయతీలకు గాను వాటి సర్పంచులు, కార్యదర్శులకు అవార్డులు బహూకరించారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, ఎమ్మెల్యే ఆనంద్‌, పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌ రవీందర్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని