త్వరలో సీఎం క్రికెట్‌ కప్‌ నిర్వహిస్తాం

త్వరలోనే గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో సీఎం క్రికెట్‌ కప్‌ పోటీలు నిర్వహిస్తామని రాష్ట్ర క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక, ఆబ్కారీ శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ వెల్లడించారు.

Published : 01 Jun 2023 04:21 IST

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

నారాయణగూడ, న్యూస్‌టుడే: త్వరలోనే గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో సీఎం క్రికెట్‌ కప్‌ పోటీలు నిర్వహిస్తామని రాష్ట్ర క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక, ఆబ్కారీ శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం-రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాట్స్‌) ఆధ్వర్యంలో నిర్వహించిన చీఫ్‌ మినిస్టర్‌ (సీఎం) కప్‌ క్రీడా పోటీలు బుధవారం ఘనంగా ముగిశాయి. శాట్స్‌ ఛైర్మన్‌ డా.ఆంజనేయగౌడ్‌ అధ్యక్షతన జరిగిన సభలో హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీతో కలిసి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ విజేతలకు ట్రోఫీలు అందజేసి మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలో ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్ది దేశానికి అందించడానికి శాట్స్‌ ద్వారా ప్రయత్నం మొదలుపెట్టామన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రం ఏర్పాటైన తరువాత తొలిసారిగా 18 క్రీడాంశాలతో సీఎం కప్‌ క్రీడాపోటీలు నిర్వహించామన్నారు. క్రమం తప్పకుండా వీటిని కొనసాగిస్తామన్నారు. ముఖ్యమంత్రి అనుమతితో రాబోయే రోజుల్లో మిగితా అంశాలను కూడా జోడిస్తామన్నారు. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌లో పైరవీలు చేసినవారికి అవకాశాలు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయన్నారు. లోపం ఎక్కడ ఉందో చూస్తామని, అవసరమైతే తెలంగాణ వరకు క్రికెట్‌ చట్టంలో మార్పులు తీసుకొస్తామన్నారు.

ఓవరాల్‌ ఛాంపియన్‌ హైదరాబాద్‌

పురుషుల విభాగంలో హైదరాబాద్‌ (89 పాయింట్లు), రంగారెడ్డి (56 పాయింట్లు), మేడ్చల్‌-మల్కాజిగిరి (41 పాయింట్లు) జట్లకు   సీఎం కప్‌ ఓవరాల్‌ ఛాంపియన్‌ షిప్‌ ట్రోఫీలను అందజేశారు. మహిళా విభాగంలో రంగారెడ్డి (49 పాయింట్లు) హైదరాబాద్‌ (36 పాయింట్లు), మేడ్చల్‌-మల్కాజిగిరి (31 పాయింట్లు) జట్లకు ట్రోఫీలు ప్రదానం చేశారు.


ఐపీఎల్‌లో క్రికెటర్లను గొర్రెల్లా కొంటున్నారు

- శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా

సరూర్‌నగర్‌, న్యూస్‌టుడే: నేటి సమాజం క్రికెట్‌ వెంట పరుగులు తీస్తోందని శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.. వాణిజ్యపరంగా ఆ క్రీడ పట్ల పెరిగిన మోజుతో ఐపీఎల్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థలు క్రికెటర్లను గొర్రెలు, బర్రెలను కొన్నట్లు కొంటున్నాయని ఆయన ఆక్షేపించారు. దీనికి గ్యాంబ్లింగ్‌ కూడా తోడైందని వ్యాఖ్యానించారు. నిజమైన క్రీడలు కబడ్డీ, వాలీబాల్‌ వంటివేనని ఆయన చెప్పారు. రంగారెడ్డి జిల్లా క్రీడలు, యువజన శాఖ ఆధ్వర్యంలో సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో గత నాలుగు రోజులుగా కబడ్డీ, వాలీబాల్‌, జిమ్నాస్టిక్స్‌ అంశాలలో జరుగుతున్న పోటీలు బుధవారం ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి సుఖేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని