కేజీబీవీ బదిలీల్లో అంతా మాయ

పాఠశాల విద్యాశాఖ పరిధిలో బదిలీలు అంటే చాలు అక్రమాలు షరామామూలే అన్నట్లు పరిస్థితి మారిపోయింది.

Updated : 03 Jun 2023 04:34 IST

కోరుకున్న పోస్టు ఆన్‌లైన్‌లో కనిపించకుండా బ్లాక్‌  
అస్మదీయుల కోసం రాజకీయ నాయకుల పైరవీ

ఈనాడు, హైదరాబాద్‌: పాఠశాల విద్యాశాఖ పరిధిలో బదిలీలు అంటే చాలు అక్రమాలు షరామామూలే అన్నట్లు పరిస్థితి మారిపోయింది. నిబంధనలు తుంగలో తొక్కి.. అర్హులను పక్కనపెట్టి అస్మదీయులకు కోరుకున్న చోట పోస్టింగ్‌ ఇప్పించుకుంటున్నారు. తాజాగా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు(కేజీబీవీ) ఉద్యోగుల బదిలీల్లోనూ పారదర్శకతకు పాతరేసినట్లు స్పష్టమవుతోంది. తమకు నచ్చిన వారికి అనుకూలమైన స్థానాలు కట్టబెట్టేందుకు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల ద్వారా పైరవీలకు తెరలేపారు. ఏకంగా సర్కారు నుంచే లిఖితపూర్వకంగా కొన్ని ఖాళీలు ఉంచాలని ఆదేశాలు ఇప్పించారు. చేసేదిలేక పాఠశాల విద్యాశాఖ అధికారులు ఆన్‌లైన్‌లో కొన్ని ఖాళీలు కనిపించకుండా మాయం చేశారు. ఆన్‌లైన్‌ విధానంలో తమకు కోరుకున్న స్థానాలు దక్కవని భావించిన కొందరు ఉద్యోగులు తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి కొన్ని ఖాళీలు ఇతరులకు కనిపించకుండా బ్లాక్‌ చేయించుకున్నారని సమాచారం.  అయితే ఇదే అదనుగా విద్యాశాఖ డైరెక్టరేట్‌ కార్యాలయం స్థాయిలో మరికొన్నింటిని బ్లాక్‌ చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో పెద్దఎత్తున నగదు చేతులు మారినట్లు ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు.

జాబితాలో ప్రత్యక్షం.. ఆన్‌లైన్‌లో మాయం

గత నెలలో కేజీబీవీల్లో స్పెషల్‌ ఆఫీసర్లు(ఎస్‌ఓ), పీజీ సీఆర్‌టీలు, సీఆర్‌టీలు, ఏఎన్‌ఎంలు, అకౌంటెంట్లు, పీఈటీల బదిలీలకు కాలపట్టిక ఇవ్వగా.. ఇప్పటికే జిల్లా పరిధిలో ముగిశాయి. ప్రస్తుతం అంతర్‌ జిల్లా పరిధిలో బదిలీల ప్రక్రియ నడుస్తోంది. ఆన్‌లైన్‌లో ఆప్షన్ల ప్రక్రియ దాదాపు పూర్తయ్యింది. త్వరలోనే పోస్టులు కేటాయించాల్సి ఉంది. అయితే డీఈఓలు విడుదల చేసిన జాబితాలో ఉన్న ఖాళీల్లో కొన్ని ఆప్షన్లు ఇచ్చుకునే సమయంలో కనిపించడం లేదు. వాటిని అధికారులే బ్లాక్‌ చేయడంతో అర్హులైన వారికి అన్యాయం జరుగుతోంది. ‘ ఎన్నో సంవత్సరాలుగా కుటుంబసభ్యులకు దూరంగా ఉంటూ ఉద్యోగాలు చేస్తున్న వారికి రాకరాక దగ్గరకు వెళ్లే అవకాశం వస్తే దక్కకుండా చేస్తున్నారు. ఈ అక్రమాలను అరికట్టకుంటే కేజీబీవీ ఉపాధ్యాయుల నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పదు’అని టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి హెచ్చరించారు.

కొన్ని ఉదాహరణలు..

* వరంగల్‌ జిల్లా పర్వతగిరిలో ఎస్‌ఓ మాధవి అక్కడి నుంచి బదిలీ కాకుండానే ఆ పోస్టు ఖాళీగా చూపిస్తోంది. పర్వతగిరిలో ఉన్న సీఆర్‌టీ తెలుగు నల్లబెల్లికి బదిలీ అయిన ఖాళీ మాత్రం చూపించడం లేదు.
* హనుమకొండ జిల్లాలో ఖాళీగా ఉన్న ధర్మసాగర్‌ ఎస్‌ఓ పోస్టు ఇతరులు ఎవరూ ఆప్షన్‌ ఇచ్చుకోకుండా మాయం చేశారు.
* రంగారెడ్డి జిల్లా కొత్తూరు కేజీబీవీలో పీజీ సీఆర్‌టీ సివిక్స్‌ పోస్ట్‌ ఖాళీగా ఉంది. ఆప్షన్‌ కనిపించడంలేదు.
* వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట కేజీబీవీలో పీజీ సీఆర్‌టీ బోటనీ ఖాళీ చూపించడం లేదు.
* మహబూబ్‌నగర్‌ జిల్లాలోని గండ్విడ్‌లో పీజీ సీఆర్‌టీ(నర్సింగ్‌) ఖాళీ ఉన్నా బ్లాక్‌ చేశారు.


సర్కారు ఆదేశాల మేరకే..

కేజీబీవీ ఉద్యోగుల బదిలీల్లో అవకతవకలపై పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులను ‘ఈనాడు’ వివరణ కోరగా.. ప్రభుత్వం నుంచి పేరు, కావాల్సిన కేజీబీవీ అని పేర్కొంటూ మెమో వచ్చిందని తెలిపారు. ఆ మేరకే కొన్నింటిని బ్లాక్‌ చేయాల్సి వచ్చిందని చెప్పారు. సర్కారు ఆదేశాలు పాటించామని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని