Afghanistan Earthquake: ఆదరించిన కుటుంబం మరణించిందని తెలియక..!

శిథిలాలుగా మారిన ఇంటి వద్ద తనను చేరదీసిన కుటుంబం కోసం వెతుకులాడుకుంటోంది ఓ శునకం. ఇన్నాళ్లు తన బాగోగులు పట్టించుకున్నవారు కనిపించడం లేదని మూగగా రోదిస్తోంది.

Published : 30 Jun 2022 01:42 IST

కాబుల్‌: శిథిలాలుగా మారిన ఓ ఇంటి వద్ద తనను చేరదీసిన కుటుంబం కోసం వెతుకుతోంది ఓ శునకం. ఇన్నాళ్లు తన బాగోగులు పట్టించుకున్నవారు ఇప్పుడు కనిపించడం లేదని మూగగా రోదిస్తోంది. పదే పదే ఆ ఇంటివద్దకు వస్తూ.. అక్కడే తచ్చాడుతోంది. ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారిన చిత్రాన్ని చూస్తుంటే ఇదే భావన కలుగుతోంది.

గతవారం కల్లోలిత అఫ్గానిస్థాన్‌(Afghanistan)లో భూకంపం(Earthquake) పెను విధ్వంసం సృష్టించింది. ఆ దేశ మారుమూల పర్వత ప్రాంతంలో సంభవించిన ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల సుమారు వెయ్యిమంది మరణించారు. వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. వేలల్లో ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ శునకాన్ని పెంచుకుంటున్న పక్టికాలోని ఓచ్కి గ్రామానికి చెందిన కుటుంబం మొత్తం ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయింది. ఇది మాత్రం ప్రాణాలతో బయటపడింది. దాంతో తనతో ఉండే కుటుంబం ఎక్కడికెళ్లిపోయిందో తెలియక వారి కోసం వెతుకుతున్నట్లున్న ఈ చిత్రాన్ని నెటిజన్ ఒకరు షేర్ చేశారు. ‘భూకంప ఘటనలో ఈ శునకాన్ని పెంచుకుంటున్న కుటుంబమంతా మరణించింది. అక్కడివారు కొందరు దీనిని తీసుకెళ్లి ఆహారం అందించి, జాగ్రత్తగా చూసుకుంటున్నట్లు చెప్పారు. కానీ ఇది మాత్రం పదేపదే శిథిలమైన ఆ ఇంటికివద్దకు వచ్చి తన వారిని వెతుక్కుంటోంది. మూగగా రోదిస్తోంది’ అంటూ ట్వీట్ చేశారు. ఈ చిత్రం నెటిజన్లను కదిలిస్తోంది. మునుపటిలా ప్రేమను పంచే కొత్త కుటుంబం దానికి దొరకాలని కోరుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని