Countries Visit: స్కూల్‌కు సెలవు పెట్టకుండా 50 దేశాలను చుట్టేసిన పదేళ్ల చిన్నారి.. అదెలాగో తెలుసా..!

పదేళ్ల చిన్నారి తల్లిదండ్రులతో కలిసి 50 దేశాలను సందర్శించింది. ఒక్క రోజు పాఠశాలకు వెళ్లడం మానేయకుండా ఈ పర్యటనలు పూర్తి చేసింది.

Updated : 22 Jul 2023 12:12 IST

లండన్‌: ప్రపంచాన్ని చుట్టేయాలని చాలా మందికి అనిపిస్తుంటుంది. అయితే.. పిల్లల స్కూళ్లు, ఉద్యోగాలు, అదనపు ఖర్చుల వంటి కారణాలతో చాలా మంది ఆగిపోతుంటారు. కానీ.. ఓ పదేళ్ల చిన్నారి ఇప్పటివరకు 50 దేశాలను సందర్శించింది. అదీ ఒక్క రోజు స్కూల్‌ మానేయకుండానే. ఆశ్చర్యంగా ఉంది కదా..! అసలు ఆ చిన్నారికి ఇన్ని దేశాలు తిరగడం ఎలా సాధ్యమైందో తెలుసా?

బ్రిటన్‌లో నివాసముంటున్న భారత్‌ సంతతికి చెందిన అదితి త్రిపాఠి తన తల్లిదండ్రులతో కలిసి ఇప్పటివరకు 50 దేశాలలో పర్యటించింది. ఐరోపా ( Europe)లోని చాలా దేశాలను సందర్శించింది. అదితి మూడేళ్ల వయసున్నప్పుడు తల్లిదండ్రులు ఆమెను తొలిసారి జర్మనీకి తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఈ పర్యటనలు కొనసాగుతున్నాయి. నేపాల్‌ (Nepal), భారత్‌ (India), థాయ్‌లాండ్‌ ( Thailand), సింగపూర్‌ (Singapore) వంటి ఎన్నో దేశాలను చుట్టేసింది. త్వరలో ఫ్రాన్స్‌, ఇటలీ, ఆస్ట్రియాకి కూడా వెళ్లనుంది.

కలల నియంత్రణకు స్వయంగా బ్రెయిన్‌లో ‘చిప్‌’.. చివరకు చావు అంచులకు..!

సౌత్‌ లండన్‌లో నివాసముంటున్న ఆమె తల్లిదండ్రులు దీపక్‌ త్రిపాఠి, అవిలాష బ్యాంకులో అకౌంటెంట్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. అదితికి చిన్న వయసులోనే వివిధ ప్రాంతాలను చూపించడం వల్ల సమాజంపై అవగాహన పెరగడంతో పాటు వివిధ సంస్కృతి, సంప్రదాయాలు, రకరకాల మనుషుల గురించి తెలుసుకోగలుగుతుందని.. ఇది తాను జీవితంలో ఎదిగేందుకు ఎంతో ఉపయోగపడుతుందని చిన్నారి తండ్రి దీపక్‌ తెలిపారు. అయితే, ఈ టూర్ల కోసం ఆమె ఒక్క రోజు కూడా స్కూల్‌కు వెళ్లడం మానలేదట..!

‘‘ఏ దేశం వెళ్లాలో ముందుగానే అనుకుంటాం. అదితిని శుక్రవారం సాయంత్రం పాఠశాల నుంచి నేరుగా పర్యటనకు తీసుకెళ్తాం. ఆదివారం రాత్రి 11 గంటల వరకు ఇంటికి చేరుకునే విధంగా ప్రణాళిక వేసుకుంటాం. ఒక్కోసారి పర్యటన నుంచి రావడం ఆలస్యమైతే ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా స్కూల్‌కి వెళ్లిపోతుంది. సందర్శన కోసం ఏడాదికి 20వేల పౌండ్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.21 లక్షలు) ఖర్చు చేస్తాం. పర్యటనలో బయట ఆహరం తినడం తక్కువే. పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టులోనే ప్రయాణిస్తాం. ఇంతవరకు మాకు సొంత కారు కూడా లేదు. అదితికి రెండేళ్ల చెల్లెలు ఉంది. తనకూ వీలైనన్ని ఎక్కువ దేశాలను చూపిస్తాం’’ అని చిన్నారి తల్లిదండ్రులు వివరించారు.

‘‘నేను ఇప్పటివరకు ఎన్నో దేశాలు తిరిగాను. నేపాల్‌, జార్జియా, అర్మేనియా అంటే ఎంతో ఇష్టం. అక్కడ నాకు ఇష్టమైన ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఎవరెస్ట్‌ శిఖరాన్ని కూడా చూశా. గుర్రపు స్వారీ చేశా. ఎన్నో విషయాలను నేర్చుకున్నా. పిల్లలంతా ఆయా దేశాలను చూడాలని కోరుకుంటున్నా. ఎందుకంటే పర్యటనల వల్ల మనం ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు’’ అని అదితి తెలిపింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని